ఎన్నికలపై ‘నోటా’ ప్రభావం, ఒక పార్టీకి అనుకూలం!: రిలీజ్పై ఈసీకి కేతిరెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథా నాయకుడిగా నటించిన 'నోటీ' సినిమా విడుదలకు అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా..
‘నోటా' చిత్రంలో అభ్యంతరం సన్నివేశాలు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేవిధంగా రూపుదిద్దుకుందని కేతిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆ తర్వాత రిలీజ్ చేయాలి
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని మొదట ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి తెలిపారు.
శాంతిభద్రతల సమస్యలు..
ఎన్నికల సమయం కావడంతో ‘నోటా' సినిమా ప్రభావం చూపుతుందని అన్నారు.అంతేగాక, ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.
నిబంధనలకు విరుద్ధం..
‘నోటా' లాంటి టైటిల్ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేతిరెడ్డి చెప్పారు. కాగా, వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు.