'టీ న్యూస్ కోసం గొంతు చించుకోవడం సరే, ఏబీఎన్ మాటేమిటి?'
హైదరాబాద్: టీ న్యూస్ ఛానల్కు నోటీసులు ఇవ్వడంపై తెరాస నేతలు భగ్గుమంటున్నారు. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిషేధాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. దొరల గడీలు కూలాలన్న అల్లం నారాయణకు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ గుర్తుకు వచ్చిందా అని టీడీపీ నేత రాజారాం యాదవ్ ప్రశ్నించారు.
ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేసినప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. టీ న్యూస్కు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారని, మరి ఆనాడు ఈ గోల ఏమయిందన్నారు. ప్రెస్ అకాడమీ కోసం ఉద్యమం ముసుగు తొడుక్కున్నారని, అది చిరగడం ఖాయమని మండిపడ్డారు.
అల్లం నారాయణ ఇప్పుడు అదే దొర గడీలకు సున్నం వేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలు దొర విషపుత్రికలుగా రాజారామ్ యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్కు డబ్బా కొట్టడం మినహా టీ న్యూస్ తెలంగాణ ప్రజల గొంతుకగా ఏనాడు వ్యవహరించలేదన్నారు.
తెలంగాణ ఆడపడుచు విమలక్క, పోరాట యోధుడు మందకృష్ణ మాదిగల ఇంటర్వ్యూలు ఎప్పుడైనా టీ న్యూస్లో వచ్చాయా అని ప్రశ్నించారు.
తాను 1998లోనే తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ కోసం ఉద్యమించానని, 180 కేసులు ఎదుర్కొని, 130 రోజులు జైలులో గడిపానని చెప్పారు. తాను అసలైన తెలంగాణవాదిని అన్నారు. ఆ ర్వాత ఎప్పుడో కేసఆర్ ఉద్యమంలోకి వచ్చారని, అలాంటి నాపై టీ న్యూస్లో చిన్న వార్త కూడా రాలేదన్నారు.