టీ న్యూస్కు నోటీస్: ఎపి పోలీసులపై చర్యలు, టీలో ఆందోళనలు
హైదరాబాద్: ఒక రాష్ట్రం పోలీసులు మరో రాష్ట్రంలోకి దర్యాప్తు కోసం వచ్చినపుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాదులోని సంబంధిత డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రా పోలీసులు టీ న్యూస్కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినపుడు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెపపారు. స్థానిక పోలీసులకు చెప్పకుండా నోటీసులిచ్చిన ఏపీ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వరావు తెలిపారు. టీ న్యూస్కు శుక్రవారం అర్థరాత్రి టీ న్యూస్కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
టీ న్యూస్ ఛానల్కు విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. శనివారంనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల సంఘాల ఆద్వర్యంలో జర్నలిస్టులు, న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేస్తూ శాంతియుత ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ సర్కారు కుట్రలు చేస్తుందని నినాదాలు చేశారు.
కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వాదులు, జర్నలిస్టులు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మీడియాకు ఏపీ సర్కారు సంకెళ్లు వేసేందుకు కుట్ర పన్నుతుందని నినాదాలు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో జర్నలిస్టులు, న్యాయవాదులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేశారు.
సంగారెడ్డిలో ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి బస్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి బస్టాండ్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, అఖిలపక్షం నేతలు పాల్గొన్నారు.
టీ న్యూస్ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బోధన్, బిచ్కుంద, భాన్సువాడ, కోటగిరి, బాల్కొండ, ఆర్మూర్, తాడ్వాయ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీ న్యూస్కు ఏపీ సర్కారు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో టీయూడబ్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. వైరా, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లిలో శాంతియుత ఆందోళనకు దిగారు.