200 వార్డులు: ప్రభుత్వానికి, జిహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ)లో డివిజన్లను 200 నుంచి 150కి ఖరారు చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, జీహెచ్ఎంసీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వార్డుల సంఖ్యను 200కు పెంచాలని గతంలో నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రస్తుతం 150 వార్డులనే కొనసాగించాలనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మలక్పేటకు చెందిన కరుణాకర్, గౌలిపురాకు చెందిన భాస్కర్ రాజ్ పిల్దాఖలు చేశారు.
12 పురపాలక సంఘాలు, 8 గ్రామ పంచాయతీలను కలుపుతూ జీహెచ్ఎంసీని 2007లో ఏర్పాటు చేశారని తెలిపారు. గత డిసెంబర్తో జీహెచ్ఎంసీ పాలకవర్గానికి గడువు ముగిసిందన్నారు. వార్డుల సంఖ్యను 200కు పెంచేందుకుగాను ఎన్నికలను వాయిదా వేయాలని సమయం తీసుకున్నారని వివరించారు.
వార్డుల సంఖ్యను 200కు పెంచుతూ ఈ ఏడాది ఏప్రిల్లో నిర్ణయం తీసుకున్నారని, ఇదే విషయాన్ని హైకోర్టుకు సైతం నివేదించారని పిటిషనర్లు తెలిపారు. కానీ ఇటీవల మరోసారి వార్డుల సంఖ్యను 150కు పరిమితం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
జనాభా పెరుగుతున్న నేపథ్యంలో 200 వార్డులను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించారు. సెప్టెంబర్ 28న జారీచేసిన జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ పినవీన్ రావు ఆధ్వర్యంలోని న్యాయస్థానం, దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలకు నోటీసులు జారీచేసింది.
వాస్తవానికి 150గా ఉన్న డివిజన్లను 172కు పెంచాలని జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం డివిజన్లను రెండొందలకు పెంచుతూ ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీహెఎంసీ అధికారులు చేసిన కసరత్తులో ఇబ్బందులు బయటపడ్డాయి.
వార్డుల విభజనను 200కు పెంచే సమయంలో భౌగోళికంగా సరిహద్దులను ఖరారు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో 2011 జనాభా ప్రకారం వార్డుల సంఖ్యను 150గా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.