ఫోన్ ట్యాపింగ్లో ఏపీ దూకుడు: తెలంగాణ హోంశాఖ కార్యదర్శికి నోటీసు
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.
తమ ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సహా పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు నోటీసులు తీసుకొని హైదరాబాదుకు బయలుదేరారు. వారు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సచివాలయంలో నోటీసులు ఇచ్చారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాలలో మూడు నెలలుగా ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూడగానే, ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఓటుకు నోటు ఏపీ సీఎం చంద్రబాబుకు, ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ సిఎం కెసిఆర్ మెడకు చుట్టుకున్నదని చెబుతున్నారు.