హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డగా మారింది.. ఎన్ఆర్సీ నిర్వహించండి.. రాజాసింగ్ సంచలనం (వీడియో)
హైదరాబాద్ : జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్ఆర్సీ) అసోంలో అక్రమంగా దాగి ఉన్న విదేశీయుల బండారాన్ని బయటపెట్టింది. 19 లక్షల పైచిలుకు విదేశీయులు గువహతిలో నక్కి ఉన్నారని ఎన్ఆర్సీ తేల్చిచెప్పింది. అయితే మిగతా చోట్ల కూడా ఎన్ఆర్సీ చేపట్టాలని డిమాండ్ వస్తోంది. రోహింగ్యా ముస్లిములు ఇతర చోట్ల కూడా తలదాచుకున్నారని పలువురు చెప్తున్నారు. తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిష్టర్ చేపట్టాలని బీజేపీ కోరుతుంది. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విన్నవించారు. భాగ్యనగరంలో 8 వేల మందికి రోహింగ్యా ముస్లింలు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
అసోం టు హైదరాబాద్ ...?
అసోంలో చేపట్టిన ఎన్ఆర్సీ హైదరాబాద్లో చేపట్టాలనే డిమాండ్ వస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. వారికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఎన్ఆర్సీ అమలు చేయాలని కోరారు. ఒక్క గువహతిలోనే కాదు బెంగాల్, కేరళ, తెలంగాణలోకి రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారని ఆరోపించారు. రోహింగ్యా ముస్లింలతో ప్రమాదం పొంచి ఉన్నదని గుర్తుచేశారు.
ఓవైసీ వర్సెస్ రాజాసింగ్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు రాజాసింగ్. హైదరాబాద్ ఎంపీ రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. బాలాపూర్, కంచన్ బాగ్లో 8 వేల మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింల సంఖ్య పెరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం సోయి లేకుండా పడుకుందా అని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎంతో ఉన్న దోస్తీ కారణంగా తెలంగాణ ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుందా అని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటుంటే ... మిగతా వారికి సమస్య ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
భాగ్యనగరంలో 8 వేల మంది
ఒక్క హైదరాబాద్లోనే 8 వేల మంది తలదాచుకుంటుంటే .. మిగతా చోట్ల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేశారు రాజాసింగ్. బాలాపూర్, కంచన్ బాగ్లో ఉన్న రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తుందని పేర్కొన్నారు. రూ.500 ఓటరు కార్డు అందిస్తున్నారని ఆరోపించారు. తమ స్వార్థ, ఓటు బ్యాంకు కోసం ఓటరు కార్డులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆధార్ కార్డుకు మాత్రం కాస్త ధర ఎక్కువ చేశారని .. రూ.వెయ్యికి ఇస్తున్నారని తెలిపారు. ఈ రెండు ఐడీ కార్డుల ప్రక్రియ ముగిసిన తర్వాత రూ.10 వేలకు పాస్ పోర్టు కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. బాలాపూర్, కంచన్ బాగ్లో ఉండేవారు నగదు ముట్టజెప్పి .. ధ్రువపత్రాలను అందజేసుకుంటున్నారని చెప్పారు. ఏదైనా అడ్రస్, ఐడీ కోసం ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టు ముఖ్యం .. హైదరాబాద్లో ఉన్న 8 వేల మంది రోహింగ్యా ముస్లింలకు ఆ ధ్రువపత్రాలు ఇస్తున్నారు. దీంతో వారి పౌరసత్వ నమోదు మరింత తేలిక అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాజాసింగ్.
రాజాసింగ్ సంచలనం
అసోంలో ఎన్ఆర్సీ తుది జాబితా విడుదలైంది. ఇందులో 19 లక్షల మంది పేర్లు గల్లంతవడం సంచలనం కలిగించింది. ఈ క్రమంలో రాజాసింగ్ హైదరాబాద్లో ఎన్ఆర్సీ నిర్వహించాలని కోరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ ప్రతిపాదన తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు రాజాసింగ్. దీంతోపాటు ట్వీట్ కూడా చేశారు. అందులో తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 నుంచి అమలు చేయాలని కోరడం మరింత హైప్ తీసుకొచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు.. ఈ క్రమంలో ఎన్ఆర్సీ నిర్వహించాలని రాజాసింగ్ కోరడం .. బీజేపీ ప్లాన్లో భాగమా అనే అనుమానం కూడా కలుగుతుంది.