ఎన్నారై భర్త నిర్వాకంలో ట్విస్ట్: రమ్య సంపాదనతోనే విలాస జీవితం!
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాదులోని కేపీహెచ్బీ మహిళ రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త మహంత్ ఆమెను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లినట్లుగా రమ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. రమ్య, మహంత్ విషయంలో మరో షాకింగ్ విషయం తెలుస్తోంది.
భర్త మహంత్ ఆస్ట్రేలియాలో పిజ్జా వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో అతడు నష్టపోయాడు. అయితే విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్న రమ్య నెలకు సుమారు రూ.3 లక్షలు సంపాదిస్తోంది. ఆ సంపాదనతోనే అత్తింటి వారు విలాసవంతమైన జీవితం గడిపేవారని రమ్య కుటుంబం ఆరోపిస్తోంది.
అంతేకాదు, అదనపు కట్నం కోసం వేధించేవారని చెప్పారు. ఆస్ట్రేలియాలోని అక్క ఇంట్లో ఉంటూ తాను చదువుకున్న సమయంలో తన బావ మహంత్ అక్కపై చేయి చేసుకున్నాడని, పెద్దలు రాజీ కుదిర్చారని రమ్య సోదరుడు చెప్పారు.
ఎన్నారై భర్త నిర్వాకం: రమ్య శవాన్ని ఎయిర్పోర్టులో వదిలేసి వెళ్లిపోయాడు
తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని రమ్య తల్లిదండ్రులు చెప్పారు. ఉరేసుకున్న ఆధారాలు లేవని, మహంత్ చెబుతున్న వివరాలు పొంతన లేవని ఆస్ట్రేలియా పోలీసులు చెప్పినట్లు ఆమె తండ్రి చెబుతున్నారు.