ఎన్ఆర్ఐ మేనల్లుడు.. బిడ్డను మంచిగా చూస్తాడనుకుంటే..!
కరీంనగర్ : మేనల్లుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం.. తన బిడ్డ సుఖపడుతుందని అతడికిచ్చి పెళ్లి చేశారు. తమ కళ్లముందే పెరిగాడు.. మరదల్ని బాగా చూసుకుంటాడని భావించారు. అల్లుడితో పాటు తమ కూతురు విదేశాల్లో హాయిగా ఉంటుందని అనుకున్నారు. లక్షల కొద్దీ కట్నమిచ్చి పెళ్లి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లైన తర్వాత మేనల్లుడి అసలు రంగు బయటపడింది. న్యూజిలాండ్ కు తీసుకెళ్లిన తమ బిడ్డను ఏనాడు సుఖపెట్టలేదు. పైగా అనునిత్యం నరకం చూపించాడు. బావే కదా అని ఆ యువతి కూడా ఓపికతో కాపురం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఆర్నెళ్లు భరించింది. పెద్దమనుషుల జోక్యంతో కూడా మనసు మారని ఆ బావ వైఖరితో చివరకు ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయం
ఎన్ఆర్ఐ మేనల్లుడి లీలలు
తంగళ్లపల్లి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చెవుల దేవయ్య - భాగ్యమ్మ దంపతుల చిన్న కుమార్తె లత (22సం.) ను.. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన రాజం లచ్చయ్య - లచ్చమ్మల రెండో కొడుకైన తమ మేనల్లుడు రాజం రవీందర్ కు ఇచ్చి వివాహం జరిపించారు. మేనల్లుడు న్యూజిలాండ్ లో ఉద్యోగం చేస్తుండటంతో.. తమ బిడ్డ సుఖపడుతుందని పెళ్లి సమయంలో కట్నకానుకలు భారీగానే ముట్టజెప్పారు. 6 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారంతో పాటు ఎకరానికి పైగా స్థలం ఇచ్చారు. 9 నెలల కిందట అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.
చిత్రహింసలు.. రోజూ టార్చరే..!
పెళ్లైన తరువాత తనతో పాటు భార్య లతను న్యూజిలాండ్ కు తీసుకెళ్లాడు రవీందర్. అందర్నీ విడిచిపెట్టి దేశం గానీ దేశమొచ్చిన భార్యను అప్యాయంగా చూసుకోవాల్సింది పోయి చిత్రహింసలకు గురిచేశాడు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి నిత్యం నరకయాతనే. తనకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయంటూ.. నువ్వే నాకు విడాకులు ఇవ్వాలంటూ హింసించాడు. నీవు నాకు సరితూగే భార్యవు కావంటూ అవహేళన చేశాడు. నీ దారి నువ్వు చూసుకోవాలంటూ టార్చర్ పెట్టాడు. బావే కదా అని ఆరు నెలల పాటు ఓపిక పట్టిన లతకు సహనం నశించిపోయింది. చివరకు న్యూజిలాండ్ నుంచి తల్లిగారింటికి చేరింది.
పెద్దమనుషులు చెప్పినా వినలేదు..!
న్యూజిలాండ్ లో భర్త పెట్టిన నరకం తాలూకు విషయాలన్నీ తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది. కొత్త కాపురం కదా, సమస్యలు సాధారణమే అనే ధోరణితో మేనల్లుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ రవీందర్ వారి మాటలు పట్టించుకోలేదు. దాదాపు మూడు నెలల పాటు చూసి చూసి చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అయితే తన భర్తపై ఫిర్యాదు వద్దంటూ లత చెప్పడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు.
అదలావుంటే నెల రోజుల కిందట స్వస్థలానికి వచ్చిన రవీందర్ పై పంచాయితీ పెట్టించారు. కనీసం పెద్దమనుషులు చెబితేనైనా వింటాడేమోననేది వారి ఆశ. కానీ ఆయన ఎవరి మాట వినలేదు. లతతో కాపురం చేయడం ఇష్టం లేదంటూ.. వచ్చిన దారినే తిరిగి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన లత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సొంత బావ మంచిగా చూసుకుంటాడని ఆశపడ్డ లత చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
భర్త తీసుకెళ్లలేదని ఆత్మహత్య.. స్థానికంగా విషాదం
ఎన్నారై భర్త వేధింపులు తట్టుకోలేక లత ఆత్మహత్య చేసుకోవడాన్ని లక్ష్మీపూర్ గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. లత మృతదేహంతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని ఆమె అత్తగారింటి ఎదుట ధర్నా చేయాలని డిసైడయ్యారు. అయితే తంగళ్లపల్లి పోలీసులు లత మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో వారి కళ్లు గప్పి ఆ వాహనాన్ని ఎల్లారెడ్డిపేట వైపు తరలించారు గ్రామస్తులు. కొద్దిదూరం వెళ్లాక విషయం తెలియగానే పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మార్గమధ్యంలో వాహనం నిలిపి గ్రామస్తులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు లత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.