ఎన్నారై జయరాం హత్య కేసులో తెరపైకి కొత్త పేరు: శిఖాచౌదరిపై కేసు నమోదు
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసులో మరో కొత్త మలుపు. ఆయన మేనకోడలు శిఖాచౌదరి పైన కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. జయరాం హత్య అనంతరం శిఖా చౌదరి అతని ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు వస్తువులు తీసుకెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి.
జయరాం హత్య తర్వాత శిఖా చౌదరి తమ ఇంటికి వచ్చి విలువైన వస్తువులు తీసుకు వెళ్లిందని పద్మశ్రీ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోను ఓసారి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరోసారి పోలీసులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో పోలీసులు శిఖాచౌదరిపై కేసు నమోదు చేశారు.
కాగా, జయరాం హత్యకేసులో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి పేరు కొత్తగా రావండంతో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేశారు. జయరాం హత్య తర్వాత రాకేష్ రెడ్డి, సుభాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. మంగళవారం (రేపు) బంజారాహిల్స్ ఏసీపీ నిందితులు నగేష్, విశాల్, సుభాష్లను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు దాదాపు వంద మందిని విచారించారు. నిందితుడితో టచ్లో ఉన్న పోలీసు అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశారు. మరోవైపు రెండో రోజు కూడా టీడీపీ నాయకుడు బిఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు.