మ్యాట్రీమోనీ పెళ్లి: యువతితో మూడ్రోజులు ఉండి పరారైన ఎన్నారై, అడిగితే టైంపాస్ అన్నాడు
హైదరాబాద్: మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన ఓ ఎన్నారై యువకుడు అమ్మాయితో మూడు రోజులు కాపురం చేసి వెళ్లిపోయిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత యువతి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు వరంగల్ జిల్లాకు చెందిన యువతి. ఆమెకు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా ఓ ఎన్నారైతో పరిచయమైంది. అతను భారత్ వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన అనంతరం మూడు రోజుల పాటు ఆమెతో కాపురం చేశాడు.
ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు షాకయ్యారు. ఆమె ఈ రోజు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు ఎల్బీనగర్కు చెందిన శ్రవణ్ కుమార్గా తెలుస్తోంది. బాధితురాలి పేరు ప్రశాంతి అని తెలుస్తోంది.
శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు కూడా ఈ సంఘటన పైన స్పందించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురుకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.
టైంపాస్కు పెళ్లి చేసుకున్నానని చెప్పాడు
అతను తనను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయాక తాను రెండు నెలల పాటు ఎదురు చూశానని బాధితురాలు చెప్పారు. తాను అతనికి ఫోన్ చేస్తే... నాకు నువ్వు వద్దు, పుస్తె, మట్టెలు తీసెయ్, టైంపాస్ కోసం పెళ్లి చేసుకున్నానని చెబుతున్నారని కంటతడి పెడుతూ బాధితురాలు చెప్పారు.
దీనిపై తాను గతంలోనే వరంగల్ కమిషనర్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనకు చెందిన బంగారం, రూ.రెండు లక్షలను అతను తీసుకు వెళ్లాడని చెప్పారు. తనను అత్తింటి వారు అర్ధరాత్రి ఇంటి నుంచి గెంటేశారని చెప్పారు. తన పైన లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. తాను పోలీసులకు రూ.5 లక్షలు లంచమిచ్చానని, తనను ఎవరూ ఏం చేయలేరని అతను చెబుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రా బ్యాంకులో చోరీ
ఘటకేసర్లోని ఆంధ్రాబ్యాంకులో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంకులో ఉన్న 5.5 కిలోల బంగారాన్ని దొంగలు అపహరించారు. ఆంధ్రా బ్యాంకు సిబ్బంది సోమవారం ఉదయం వచ్చారు. అప్పుడు దొంగతనం జరిగిన విషయం గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉన్నాయి. వారు గ్రిల్స్ తొలగించి, లాకర్స్ కట్ చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటిని కొందరు బ్యాంకులో కుదువపెట్టారు. దొంగలు సిసి కెమెరా హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ వైఫల్యమే కారణమని పోలీసులు చెప్పారు.