జయరాం హత్యలో నేతలని ప్రశ్నించనున్నారు: మళ్లీ శిఖాచౌదరి వాంగ్మూలం! వారి అరెస్ట్కు రంగం?
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో ఆరో రోజు నిందితుల విచారణ ముగిసింది. రాకేష్ రెడ్డితో కాంటాక్టులో ఉన్న వారిని అందర్నీ పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు మూడు రోజుల ముందు, హత్య తర్వాత రెండు రోజులు రాకేష్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడాడో.. వారందరినీ విచారిస్తున్నారు.
అలాగే, జయరాం మేనకోడలు శిఖాచౌదరి వాంగ్మూలాన్ని మరోసారి తీసుకోనున్నారు. ఈ కేసులో మరికొంతమందిని విచారించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు అరవై మందిని విచారించారు. కాగా, ఈ హత్యకు సంబంధించి రౌడీషీటర్ నగేష్, విశాల్లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసు అధికారుల విచారణ
జయరాం హత్య కేసులో నిందితులను పోలీసులు గత కొద్ది రోజులుగా విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో ఆరోపణలు పలువురు పోలీసు అధికారులను కూడా విచారించారు. అలాగే, జయరాం హత్య గురించి తెలిసినా ఎందుకు చెప్పలేదు? హత్యోదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు తమను సంపద్రించాడనే సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదనే కోణంలో పోలీస్ అధికారులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాకేష్ రెడ్డికి సహకరించారనే ఆరోపణలను ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రాంబాబు తదితరులు బుధవారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు.
హత్య గురించి చెప్పలేదు
జయరాం హత్య కేసును రాకేష్ రెడ్డి తమకు చెప్పలేదని పోలీసు అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. రాకేష్ రెడ్డి తనకు ఫోన్ చేశాడని, అత్యవసరంగా కలవాలని కోరాడని, దూరం ఉన్నానని చెప్పినప్పటికీ పదేపదే ఫోన్ చేశాడని, దీంతో తాను ఉన్నచోటుకు రావాలని చెప్పానని, నిందితుడు తనతో పది నిమిషాలు మాట్లాడి వెళ్లాడని, ఆ సమయంలో హత్య విషయాన్ని తనతో చెప్పలేదని చెప్పారని తెలుస్తోంది. రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడింది నిజమేనని, ఇబ్బందుల్లో ఉన్నానని చెబితే మాత్రం సలహాలు ఇచ్చానని, తమకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని చెప్పారని తెలుస్తోంది. కాగా, విచారణ అనంతరం ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కారులో వెళ్లిపోయారు.
రాకేష్ రెడ్డి భూకబ్జాదారు
రాకేష్ రెడ్డితో పరిచయాలు ఉన్నంత మాత్రాన పోలీస్ అధికారులను నిందితుల జాబితాలో చేర్చలేమని, నేరాలను ప్రోత్సహించినట్టు గానీ, అతడి భూ కబ్జాలకు సహకరించినట్టుగానీ రుజువులు ఉంటే మాత్రం చర్యలు తప్పవని డీసీపీ బుధవారం తెలిపారు. రాకేష్రెడ్డి పలు భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆధారాలున్నాయన్నారు. జయరాం నుంచి ఆరు ఎకరాల భూమిని కాజేయాలని ప్రయత్నం చేసినట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రాజకీయ నాయకులను రెండు రోజుల్లో ప్రశ్నిస్తామన్నారు.