నయీం కేసులో వెలుగు చూడని నిజాలు: ఎన్నారైలకు వార్నింగ్, 50 లక్షలు వసూలు
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇంకా వెలుగు చూడని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు నయీం కేసులో 2 శాతం మంది బాధితులు మాత్రమే సిట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఐదు వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ కౌంటర్ జరిగి 80 రోజులు ముగిసిన నేపథ్యంలో ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే ఈ కేసు తుది దశకు చేరుకోనుంది. నయీం ద్వారా పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు ఆర్ధిక లావాదేవీల ద్వారా లభ్దిపొందారనేది ప్రధాన అభియోగంగా వినిపిస్తున్న మాట.
ఇప్పటి వరకు ఈ కేసులో 130 మంది బాధితులు మాత్రమే సిట్ను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నయీం బంధువులతో పాటు అనుచరులతో మొత్తంగా 99 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా జైల్లో ఉన్నారు. నయీం ఏకంగా రూ. 20 వేల కోట్లకు పైగా లావాదేవీలు నడిపినట్లు సిట్ గుర్తించింది.
అండర్ వరల్డ్ డాన్లు దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ను మించి నయీం అకృత్యాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణలో భాగంగా 14 మంది పోలీసులకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. తాజాగా నయీం బాధితులైన ఐదుగురు ఎన్నారైలు తమ గోడుని సిట్కు వివరించారు.
తమ వారిని కిడ్నాప్ చేసి, తమను ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారో సవివరంగా ఈ మెయిల్స్లో ఐదుగురు ఎన్నారైలు సిట్కు వివరించారు. ఇక ఓ కీలక నేత నయీంతో కలిసి పలు సెటిల్ మెంట్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ భూదందాలు, సెటిల్ మెంట్లకు సంబంధించిన ఆడియో టేపులను సిట్ స్వాధీనం చేసుకుంది.
ఓ రిటైర్డ్ అధికారి నయీంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు సిట్ అధికారులు ఆధారాలను సేకరించారు. సదరు అధికారి నగరం నడిబొడ్డున ఎంతో విలువైన నాలుగు ఎకరాల భూమి సెటిల్ మెంట్లో కీలక పాత్ర పోషించాడు. మూడు, నాలుగు రోజుల్లో సిట్కు చట్ట బద్దత కల్పిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయనుంది.
ప్రస్తుతం సిట్ డీజీపీ ఆధ్వర్యంలో వేసిన ఓ ఉన్నత స్థాయి ప్రత్యేక బృందం. నయీం కేసులో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఆర్ధిక లావాదేవీల ద్వారా లబ్ధిపొందారనే అభియోగం ఉన్న నేపథ్యంలో సిట్కు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టాలంటూ డీజీపీ తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు.
ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇదే గనుక జరిగితే నయీంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు అందజేసి సిట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రశ్నించే అవకాశం సిట్కు రానుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సిట్ తన పనిని మొదలు పెట్టనుంది.