ఎన్ఎస్ యూఐ మెరుపు ధర్నా.!మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద రచ్చరచ్చ.!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సంబంధిచిన వైద్యకళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్ యూఐ నాయకులు మెరుపు సమ్మెకు ఉపక్రమించారు. దీంతో కళాశాల బయట పెద్ద ఎత్తున పోలీసులు మొహరించడంతో యుద్ద వాతావరణాన్ని తలపించింది. తెలంగాణ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సారథ్యంలో 50 మంది ఎన్ఎస్ యూఐ నాయకులు పీపీఈ కిట్లు ధరించి సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదుట బఫర్ జోన్ నియమాలను పాటించకుండా, చెరువు భూములను కబ్జా చేసి మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ నిర్మించారని ఎన్ఎస్ యూఐ నేతలు ఘాటుగా విమర్శించారు.
చెరువు భూములు కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం..
మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ నాయకులు డిమాండ్ చేసారు.అంతే కాకుండా కరోనా మహమ్మారిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని మరియు అక్రమాలకు పాల్పడుతున్న మినిస్టర్ మల్లారెడ్డి నీ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని వినూత్ననంగా నిరసన తెలపడం జరిగింది.
నిరసన తెలిపే క్రమంలో అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మల్లారెడ్డి హాస్పిటల్ బోర్డు కు నల్ల రంగు వేసేందుకు ప్రయతించడంతో మల్లారెడ్డి హాస్పిటల్ భద్రతా సిబ్బంది మరియు మినిస్టర్ మల్లారెడ్డి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆపే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా పరిణమించింది.
కాలేజీ సెక్యూరిటీ సిబ్బందితో తోపులాట..
అంతే కాకుండా ఎన్ఎస్ యూఐ నాయకులను అసభ్య పదజాలంతో దూషించడంతో ఎన్ఎస్ యూఐ నేతలకు కాలేజీ సిబ్బందికి, సెక్యూరిటీ సభ్యులకు తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకొని నిరసన తెలుపుతున్న ఎన్ఎస్ యూఐ నాయకులను అదుపులోకి తీసుకొని దుండిగల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తీవ్రంగా స్పందించారు. బఫర్ జోన్ నియమాలను పాటించకుండా, అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెరువు భూములను కబ్జా చేసి మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ ని నిర్మించారని మండిపడ్డారు.
న్ఎస్ యూఐ నాయకులను అరెస్టు చేసిన పోలీస్ లు..
కాబట్టి మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని అదే విధంగా కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని మరియు అక్రమాలకు పాల్పడుతున్న మినిస్టర్ మల్లారెడ్డి నీ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని, కరోనా బారిన పడి తెలంగాణ ప్రజలు ప్రాణాలను కోల్పోతుంటే రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ మీడియా ముఖంగా పేర్కొనడం సిగ్గు చేటని, తమ నిరసన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తామందరం పీపీఈ కిట్లు ధరించడం జరిగింది బలమూరి వెంకట్ తెలిపారు.
ధర్నా విరమించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినప్పటికి ఎన్ఎస్ యూఐ నాయకులు వినిపించుకోకుండా నినాదాలు చేస్తూండంతో పోలీసులు వారిని అరెస్టు చేసి దుందిగల్ స్టేషన్ కు తరలించారు.
Recommended Video
ఎన్ఎస్ యూఐ నేతలపై కేసు పెడితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన..
మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ భూమిలో అక్రమంగా మెడికల్ కాలేజి నిర్మించుకున్నారని, అదే అంశంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అద్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజి ముందు ప్రజాస్వామ్యాయుతంగా ధర్నా చేస్తున్న నాయకులపై పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరించి వెంకట్ తోపాటు విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టేందుకు కుట్ర చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. వెంకట్ తో పాటు ఇతర నాయకులందరిని భేషరతుగా వదిలి పెట్టాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వి.హెచ్ హెచ్చరించారు.