కరోనా వైరస్.. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్,రాంచరణ్ కీలక సందేశం..
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.. నియంత్రణ చర్యలపై అన్ని దేశాలు తమ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు తరుపున చేయాల్సిన పనులు చేస్తూనే.. ప్రజలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా శుభ్రత విషయంలో జాగ్రత్త అవసరమని నొక్కి చెబుతున్నాయి. అలాగే కొద్ది రోజుల పాటు పబ్లిక్ ఫంక్షన్లు,ఈవెంట్స్,జనం ఎక్కువగా ఉండే ఇతరత్రా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.ఇప్పటికే మాల్స్,థియేటర్స్ మూసివేతతో జనసమ్మర్థ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అటు సినీ తారలు,టీవీ సెలబ్రిటీలు కూడా కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో నటిస్తున్న ఎన్టీఆర్,రాంచరణ్లు కరోనా వైరస్ నియంత్రణపై ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు.
ఎన్టీఆర్-రాంచరణ్ సలహాలు సూచనలు
'చేతులు సబ్బుతో మోచేతి వరకు కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడు.. భోజనానికి ముందు.. కనీసం ఇలా రోజుకు ఏడెనిమిది సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోండి' అని ఎన్టీఆర్ చెప్పారు. ఇక రాంచరణ్ మాట్లాడుతూ.. ' కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వాళ్లు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం.. ముక్కు తుడుచుకోవడం.. నోట్లో వేళ్లు పెట్టుకోవడం వంటివి చేయకూడదు.' అని చెప్పారు.
ఎన్టీఆర్-రాంచరణ్ సలహాలు సూచనలు
పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్లు వేసుకోవాలన్నారు ఎన్టీఆర్. అంతేగానీ,ఏమి లేకుండా మాస్కులు వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 అంటుకునే ప్రమాదం ఉందన్నారు. 'ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా.. మోచేతిని అడ్డం పెట్టుకోండి.'అని చెప్పారు. జనం ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లవద్దని రాంచరణ్ చెప్పారు. మంచి నీళ్లు ఎక్కువ తాగమన్నారు. అలా అని గడగడ తొందరగా తాగకుండా.. ఎక్కువసార్లు కొంచెం, కొంచెంగా తాగాలన్నారు. వేడి నీళ్లు అయితే ఇంకా మంచిదని చెప్పారు.
ఎన్టీఆర్-రాంచరణ్ సలహాలు సూచనలు
కరోనా వైరస్పై వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తను నమ్మవద్దన్నారు ఎన్టీఆర్. వాటిల్లో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయవద్దన్నారు. వాటివల్ల అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయన్నారు. వైరస్ కంటే ఇలా చేయడం ప్రమాదకరమన్నారు. డబ్ల్యూహెచ్వో వెబ్సైట్లో ఇచ్చే సూచనలను అందరం ఫాలో అవుదామన్నారు. ఇక చివరగా రాంచరణ్ మాట్లాడుతూ... 'కోవిడ్-19 మీద ప్రభుత్వం ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే రక్షించుకుందాం. శుభ్రంగా ఉంది.. భద్రంగా ఉందాం..' అని చెప్పుకొచ్చారు.