దటీజ్ కెసిఆర్, టైంచూసి కొట్టారు!: బాలకృష్ణ ముందే టిడిపికి కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఇతర ప్రముఖుల ఎదుటే.. సినిమా రంగానికి చెందిన వేదిక పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు గట్టి షాకిచ్చారు.
మరోసారి 'దటీజ్ కెసిఆర్' అనిపించుకున్నారు. శుక్రవారం నాడు బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. దీనికి రాజకీయ, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన ప్రశంసలు కురిపించారు.
అదే వేదిక పైన తెలంగాణ టిడిపి నేతలకు చురకలు అంటించారు. ఇటీవల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి జరిగింది. ఆ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో.. ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా.. అంబేడ్కర్ విగ్రహం కోసం ఎన్టీఆర్ ఘాట్ పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం ఎన్టీఆర్ సమాధి ఉంచి, మిగతా దానిని తీసివేస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహం అవసరమేనని, కానీ ఎన్టీఆర్ గార్డెన్ను తొలగించవద్దని మాట్లాడారు.
తెలంగాణ టిడిపి నేతల విమర్శల పైన కెసిఆర్ ఇప్పటి దాకా స్పందించలేదు. కానీ, ఈ రోజు (శుక్రవారం) బాలకృష్ణ ఎదుటే.. తెలంగాణ టిడిపి నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ మహోన్నత నేత అని, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఎన్టీఆర్ పేరు తెలియని వారు ఉండని చెప్పారు. తెలుగు జాతి గురించి ప్రపంచానికి చాటిన నాయకుడు అన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ను తీసేస్తారని కొందరు చెప్పారని, అది సరికాదని, ఆ మహానాయకుడి ఘాట్ అలాగే ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ పేరు మార్చమని స్పష్టం చేశారు. అది చిరస్థాయిగా ఉంటుందన్నారు. దీనిపై ఇప్పటిదాకా మాట్లాడని కెసిఆర్.. సమయానుసారంగా సరైన సమయంలో కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. టిడిపి విమర్శలు చేసినప్పుడే.. రాజకీయ విమర్శలు సరికావని టిఆర్ఎస్ నేతలు చెప్పారు.