ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం: వైసిపి కార్యకర్తల పనేనా?
గుంటూరు: గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలంలోని మద్దిరాలలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు గోంగూర చల్లారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామ టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
విషయం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు పెద్దఎత్తున విగ్రహం వద్దకు చేరుకున్నారు. చిలకలూరిపేట - కోటప్పకొండ రహదారిపై రాస్తారోకో చేపట్టాయి. శనివారం రాత్రి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గడపగడపకూ కార్యక్రమం చేపట్టిందని, విందు కూడా ఏర్పాటు చేశారని ఇది వారిపనేనని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ ఉదయ్బాబు సిబ్బందితో మద్దిరాల చేరుకున్నారు. విగ్రహంపై గోంగూర చల్లిన వారిని తప్పనిసరిగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో రాస్తారోకో విరమించిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు.
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేకనే వైపీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి గోంగూర చల్లి దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో గోదాము శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై గోంగూర చల్లిన దుశ్చర్యను ఖండించారు.
రాష్ట్రంలో దశ, దిశ లేని పార్టీ వైసీపీ అని అన్నారు. టీడీపీ ఎదుగుదలను చూసి వైసీపీ తట్టుకోలేక పోతోందన్నారు. ప్రజాదరణ కోల్పోయిన నాయకులు చేసిన పనిగా అభివర్ణించారు. ఇటువంటి దుర్మార్గపు పనులు చేయడం తగదన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వెళ్లిన వారు మాడి మసై పోతారన్నారు.