టీడీపీలో ఉన్నది ఎన్టీఆర్ ఆశయాలు కావు .. ఉన్నదల్లా నారావారి ఆశయాలే .. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో చంద్రబాబు నాయుడు పై విమర్శలను గుప్పించారు. కేంద్రంలో చంద్రబాబునాయుడు చక్రం తిప్పాలని చాలా ప్రయత్నం చేశారని, అటు కేసీఆర్ సైతం కేంద్రంలో చక్రం తిప్పుతానని కలలు కన్నారని కానీ ప్రజలు బిజెపి ధర్మచక్రానికే పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారని, అవమానకర రీతిలో మాట్లాడారని అందుకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అన్న కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఆశయాలను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు .అందుకే చంద్రబాబుకి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ఆశయాలకు కట్టుబడి టిడిపి పని చేసింది అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు టీడీపీ లో ఉన్నది ఎన్టీఆర్ ఆశయాలు కాదని.. నేడు ఉన్నదల్లా నారావారి ఆశయాలేనని ఎద్దేవా చేశారు.
బీజేపీపైన విష ప్రచారం చేసిన ఫలితం , టీడీపీ అడ్రెస్ గల్లంతు అన్న కిషన్ రెడ్డి
మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కూడా ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ ఎంతో చూసిందని కానీ చంద్రబాబు నాయుడు మసి పూసి మారేడు కాయ చేసి బీజేపీపై విష ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. బిజెపి పైన చేసిన విష ప్రచారం తోనే చంద్రబాబు నాయుడు కనుమరుగయ్యారు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తే, నేడు చంద్రబాబు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కి , సిద్ధాంతాలను పక్కన పెట్టి రాహుల్ గాంధీ పాదాల ముందు టిడిపిని పెట్టారని ఆయన మండిపడ్డారు. ఆ ఫలితంగానే ఇప్పుడు టిడిపి అడ్రస్ లేకుండా పోయిందని, ప్రజలు బుద్ధి చెప్పారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్న కిషన్ రెడ్డి
చంద్రబాబు బిజెపిని మట్టి కరిపించాలని భావించారు కానీ తానే అడ్రస్ లేకుండా పోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబును ఎన్నటికీ క్షమించబోరని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ అభివృద్ధికి తాను సైతం సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.