సుహాసినిని గెలిపించండి: లోకేష్, జూ.ఎన్టీఆర్ వస్తారా అని అడిగితే.. బాలకృష్ణ ఏం చెప్పారంటే?
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆమెను కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నారా లోకేష్ ట్వీట్
స్వర్గీయ నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణలకు ఆమె గెలుపు అసలైన నివాళి అని పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, బడుగులకు ఆత్మీయునిగా సేవలందించిన ఎన్టీఆర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ గుండెకు హత్తుకున్న తీరు మరువలేనిదనిదన్నారు. తెలంగాణలోనే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని, అక్కడే ఆయన అమరులయ్యారని గుర్తు చేశారు.
జూ.ఎన్టీఆర్ ప్రచారంపై బాలకృష్ణను అడగ్గా..
నందమూరి సుహాసినితో పాటు టీడీపీ, మహాకూటమి అభ్యర్థుల తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలని టీడీపీ వర్గాలు కోరుతున్నాయి. దీనిపై బాలకృష్ణను విలేకరులు అడగ్గా.. వారి వీలును బట్టి వస్తే వస్తారని చెప్పారు. తాను 26వ తేదీ తర్వాత ప్రచారానికి వస్తానని బాలకృష్ణ చెప్పారు. జూనియర్తో ప్రచారం చేయించాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. ఇందుకోసం కొందరు నేతలు ఆయనను కలవనున్నారని తెలుస్తోంది.
సుహాసిని ఇంటికి వెళ్లిన సోదరులు
శనివారం సుహాసిని నామినేషన్ సందర్భంగా ఉదయమే జూ.ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు సుహాసిని నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఆమెకు మద్దతుగా తమ సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రకటన విడుదల చేశారు.
సుహాసిని వెంట ఫ్యామిలీ
సుహాసిని శనివారం నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమె వెంట హిందూపురం ఎమ్మెల్యే, బాబాయి బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందడి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ సమాధి వద్ద, రాయదుర్గంలోని మహాప్రస్థానంలో తన తండ్రి హరికృష్ణ సమాధి వద్ద సుహాసిని నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి, కుమారులు మోహన్ కృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ సతీమణి జయశ్రీ, కల్యాణ్రామ్ సతీమణి స్వాతి, జానకిరాం సతీమణి దీపిక, హరికృష్ణ మనవడు హర్ష, ఎన్టీఆర్ వరుసకు సోదరుడు ఎంఎస్ ప్రసాద్ తదితరులు అప్పుడు ఆమె వెంట ఉన్నారు. తెలంగాణ బిడ్డగా ప్రజల మద్దతు తనకు కావాలని కోరుతున్నానని, నాన్నగారి ధైర్యంతో ముందుకు సాగుతానని, అందరి సహకారం తీసుకుంటూ సేవ చేస్తానని, జై తెలంగాణ అని వ్యాఖ్యానించారు.