హైదరాబాద్కా షాన్: గోల్కొండకు పెరిగిన పర్యాటకులు.. వెనకబడ్డ చార్మినార్,ఎందుకో తెలుసా..?
ప్రముఖ పర్యాటక ప్రాంతం గోల్కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. 2014-16 గణాంకాల ప్రకారం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ సారి గోల్కొండ నుంచే ఎక్కువగా డబ్బులు పర్యాటకుల నుంచి వచ్చింది. గోల్కొండ కోటకు రూ.3కోట్లు రాగా... మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఛార్మినార్కు రూ.2.66 కోట్లు వచ్చింది.
హైదరాబాద్ కా షాన్ గోల్కొండ
ఎవరైనా హైదరాబాద్కు వస్తే రెండు పర్యాటక ప్రాంతాలు తప్పనిసరిగా చూడాలనుకుంటారు. అందులో చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ముందు వరసలో ఉండగా రెండో వరుసలో గోల్కొండ ఉంటుంది. అయితే గతంలో ఎక్కువ మంది చార్మినార్ను చూసేందుకే ఇష్టపడేవారట.
కానీ క్రమంగా చార్మినార్ను చూసే సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం పర్యాటకుల తాకిడి ఎక్కువగా గోల్కొండ వైపు మళ్లినట్లు గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. ఇందుకు నిదర్శనం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు గోల్కొండ ద్వారా రూ. 3 కోట్లు రాగా... చార్మినార్కు రూ. 2.66 కోట్లు వచ్చింది. గోల్కొండకు వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా... అదే చార్మినార్కు పర్యాటకుల సంఖ్య స్థిరంగా ఉంది. మొత్తంగా తెలంగాణలో మూడు చారిత్రక కట్టడాల నుంచి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖజానాకు రెవిన్యూ వస్తోంది. ఏపీలో 5 చారిత్రక కట్టడాలు ఉన్నప్పటికీ అంతగా రెవిన్యూ రావడం లేదని చెబుతోంది భారత పురావస్తు శాఖ.
గోల్కొండ, చార్మినార్లకు ప్రవేశ రుసుం
ప్రస్తుతం గోల్కొండకు ప్రవేశ రుసుం భారతీయులకు ఒక్కొక్కరికి రూ.15 వసూలు చేస్తుండగా... విదేశీయులకు అది రూ. 200గా ఉంది. ఇక స్టిల్ కెమెరాలకు రూ. 25 వసూలు చేస్తుండగా... సౌండ్ అండ్ లైట్ షోలకు రూ. 130 వసూలు చేస్తున్నారు. ఇక చార్మినార్ ప్రవేశ రుసుం భారతీయులకు ఒక్కొక్కరికి రూ. 5 ఉండగా... అదే విదేశీయులకు రూ. 100గా ఉంది. ఇక గోల్కొండకు అధిక మొత్తంలో లాభాలు సౌండ్ అండ్ లైట్ షోల నుంచే వస్తోంది.
ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాకతో అత్యంత సుందరంగా మారిన గోల్కొండ కోట
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ నుంచి గోల్కొండకు తరలించిన తర్వాత అక్కడ నిర్వహణపై మున్సిపల్ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఇందులో భాగంగా సదుపాయాలు మెరుగుపర్చడంతో పాటు అక్కడి పరిసరాలను శుభ్రపరచడంలాంటివి చేస్తున్నాయి. ఇక 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఆమె గోల్కొండను సందర్శించారు. ఇవాంకా వస్తుండటంతో ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దారు. అంతేకాదు గోల్కొండ పలు సినిమా షూటింగులకు, ప్రభుత్వ సమావేశాలకు వేదికగా నిలుస్తోంది. ఇక ప్రతి నెల గోల్కొండకు పర్యాటకుల నుంచి వస్తున్న రుసుం చార్మినార్ కంటే రూ. 50వేలు ఎక్కువగా ఉన్నట్లు భారత పునరావస్తు శాఖ అధికారి మిలాన్ కుమార్ చౌలే తెలిపారు. అంతేకాదు తెలంగాణలో చూసుకుంటే గోల్కొండకే అత్యధిక రెవిన్యూ వస్తుండగా అత్యల్పంగా వరంగల్ కోట నుంచి వస్తోందని తెలిపారు.
19 రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాలకు ప్రవేశ రుసుం
భారతీయ పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాల సందర్శనకు టికెట్ వసూలు చేస్తోంది. 2014 నుంచి 2016 గణాంకాల ప్రకారం 25శాతం తక్కువగా వార్షిక ఆదాయం వచ్చినట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఆగ్రాలోని తాజ్మహల్, కర్నాటకలోని హంపిలో తక్కువగా రెవిన్యూ రావడంతో లోటు ఏర్పడింది. 10 చారిత్రక కట్టాడాల వద్ద రెవిన్యూ రూ.10 లక్షలకు తక్కవగా వచ్చినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు.