కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు, తిరుపతిలో కూడా
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో తొలి దశ పూర్తి కావడంతో ఇప్పుడు రెండో దశపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
Recommended Video
రెండో దశ.. మూడు కొత్త మార్గాలు..
అంతేగాక, శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించేందుకు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ రాయదుర్గం నుంచి ఆర్జీఐఏ(31 కిలోమీటర్లు), లక్డీకపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ పాతబస్తీలో 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ మెట్రోకి రోజుకు రూ. కోటి, మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ. 10 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మందికిపైగా మెట్రోలో ప్రయాణించారని తెలిపారు.
తిరుమల కొండపైకి..
ఇక ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో ప్రాజెక్టు విషయంలో మూడు రోజులు సర్వే చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించారని, ఈ క్రమంలో మెట్రో ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి నుంచి తిరుమల వరకు మెట్రో ప్రాజెక్టుకు ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తిరుపతిలో ఎల్ఎంవీఎస్.. వైవీ సుబ్బారెడ్డితో ఎన్వీఎస్ కీలక చర్చ
కాగా, ఇటీవల తిరుపతి వెళ్లిన సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. తిరుపతిలో మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. లైట్ మెట్రో వెహికిల్ సిస్టమ్(ఎల్ఎంవీఎస్) ఏర్పాటుపై కూడా యోచించాల్సిన అవసరం ఉందని ఎన్వీఎస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపినట్లు సమాచారం. మెట్రో రైలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఎన్వీఎస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఎన్వీఎస్ రెడ్డి తిరుపతి మెట్రో రైలుపై ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.