మెట్రో రైలులో మరదలు మైసమ్మ: ఏమిటిది అంటే..
హైదరాబాద్: హైదరాబాదు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) ఎన్వీస్ రెడ్డి మంచి ఉత్సాహంతో ఉన్నట్లున్నారు. మెట్రో రైలు మొదటి దశను పూర్తి చేసి, నగరవాసులకు అందుబాటులోకి తేవడంతో ఆయన ప్రతిష్ట పెరిగింది.
Recommended Video
తనలోని కళాకారుడికి ఎన్వీఎస్ రెడ్డి పదును పెట్టారు. శుక్రవారం సికింద్రాబాదులోని కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు.
పాటలోనూ మెట్రో రైలే..
కళాశాల వార్షికోత్సవంలో ఆయన ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ'.. అంటూ పాటలు పాడి విద్యార్థినుల్లో ఉత్సాహం నింపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్లోబల్ సిటీగా హైదరాబాద్..
మెట్రోరైలు రావడంతో హైదరాబాదు గ్లోబల్ సిటీగా మారుతుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని ఆయన చెప్పారు.
విద్యార్థినులకు ఉపదేశం
ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైందని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని ఎన్వీఎస్ రెడ్డి విద్యార్థినులకు సూచించారు. కాలేజీ టాపర్స్కు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
హైదరాబాద్ మెట్రో కీర్తి...
హైదరాబాద్ మెట్రో రైలు కీర్తి ఎన్వీఎస్ రెడ్డికి దక్కింది. గడువులోగా మెట్రో రైలును కూత పెట్టించడంలో అడ్డంకులను అధిగమించి ఆయన విజయం సాధించారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆయన దృష్టి పెట్టారు.