రాహుల్పై 'ఒబామా' వ్యాఖ్యలు..గల్లీ నుంచి ఢిల్లీ దాకా భగ్గుమంటున్న కాంగ్రెస్... జగ్గారెడ్డి ఫైర్...
దేశంలో ఎన్డీయే హవాను ఎదుర్కొనే శక్తి ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా.. ఇంటా,బయటా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే రాహుల్ను పప్పు అని హేళన చేస్తున్న బీజేపీకి ఒబామా వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి. దీంతో నిన్న,మొన్నటివరకూ ఒబామా అంటే అభిమానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడాయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు భారత రాజకీయాల గురించి ఆయనకేమి తెలుసునని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ ఒబామా ఏమన్నారు...
తన రాజకీయ ప్రయాణం,జీవిత అనుభవాలపై బరాక్ ఒబామా 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' అనే పుస్తకం రాశారు. ఇందులో భారత రాజకీయాల గురించి కూడా ప్రస్తావించిన ఆయన... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై తన అభిప్రాయాలు రాసుకొచ్చారు. రాహుల్ను ఉద్దేశించి... 'తరగతి గదిలో టీచర్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్ గాంధీ చాలా ఆత్రుతగా కనిపిస్తాడు.కానీ ఒక విషయంపై లోతైన అధ్యయనం చేయాలన్న అభిరుచి మాత్రం ఆయనలో లేదు.' అని ఒబామా వ్యాఖ్యానించారు.
మాణికం ఠాగూర్ రియాక్షన్...
రాహుల్ ఇంకా పరిణతి చెందలేదన్నట్లుగా ధ్వనిస్తున్న ఒబామా వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. సీడబ్ల్యూసీ సభ్యుడు,తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ట్విట్టర్లో దీనిపై స్పందించారు. '2009 నుంచి నేను ఒబామాను ఫాలో అవుతున్నాను. భారత రాజకీయ నేతలపై ఒబామా చేసిన వ్యాఖ్యలు నిజమైన భారతీయులెవరూ అంగీకరించరు. ఆయన్ను నేను అన్ఫాలో చేస్తున్నాను... మీరు కూడా అన్ఫాలో చేస్తారా...?' అంటూ ఠాగూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
రణదీప్ సూర్జేవాలా,సంజయ్ రౌత్ రియాక్షన్...
ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాత్రం... వ్యక్తిగత అభిప్రాయాలపై తాము మాట్లాడమని చెప్పారు. కానీ ఆ తర్వాత ట్విట్టర్లో దీనిపై స్పందించిన సూర్జేవాలా... 'మీడియా మిత్రులకు నేనో విషయం గుర్తుచేయాలా... గతంలోనూ ఓ దేశ అధ్యక్షుడు అప్పటి భారత మహిళా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ,దాని ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంది. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటు &హరితవిప్లవం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ముందుకు సాగుతుంది.' అని తెలిపారు. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఒబామా వ్యాఖ్యలపై స్పందించారు. 'భారత రాజకీయ నాయకులపై ఓ విదేశీ పొలిటీషియన్ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కాంగ్రెస్ నేత రాహుల్పై ఒబామా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. ట్రంప్ ఒక పిచ్చోడు అని మనం అనలేం కదా. అసలు ఈ దేశం గురించి... ఇక్కడి పరిస్థితుల గురించి ఆయనకేం తెలుసు..' అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
Recommended Video
జగ్గారెడ్డి రియాక్షన్...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఒబామా వ్యాఖ్యలపై స్పందించారు. ఒబామా వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పిన జగ్గారెడ్డి... అమెరికా రాజకీయాలు వేరు,ఇక్కడి రాజకీయాలు వేరు అన్నారు. అమెరికాలో కుల,మత రాజకీయాలు ఉండవని... ఇక్కడ వంద కులాలు,పదుల సంఖ్యలో మతాలు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని.. బీజేపీ హిందూ రాజకీయం,ఎంఐఎం ముస్లిం రాజకీయం,టీఆర్ఎస్ ప్రాంతీయవాద రాజకీయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అన్నారు. స్వాతంత్ర్యం నుంచి నేటి వరకూ కాంగ్రెస్ అధికారం కోసం ఎమోషనల్ పాలిటిక్స్ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ భావంతో... ప్రపంచ దేశాల సత్సంబంధాలతో నడిచే పార్టీ అన్నారు. ఇవన్నీ అవగాహన లేక ఒబామా రాహుల్పై విమర్శలు సరికాదన్నారు. ప్రపంచం ,దేశంలో ఎవరైనా రాహుల్ గాంధీని విమర్శించే ముందు వారి చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.