ర్యాలీ: పోలీస్ నుంచి తప్పించుకున్న దానం, 'తెలంగాణ బంద్' ప్రభావం ఉండేనా?
హైదరాబాద్: శనివారం నాటి తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు శాంతి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా దానం, అంజన్ కుమార్ యాదవ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తీరు పైన మండిపడ్డారు. ఓ సమయంలో దానం నాగేందర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరిగి చార్మినార్ వద్దకు వెళ్లారు. పోలీసులు ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
10వ తేదీన బంద్ ప్రభావం ఉంటుందా?
రైతు ఆత్మహత్యల పైన అసెంబ్లీలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్ ప్రభావం ఏమైనా ఉంటుందా అనే చర్చ సాగుతోంది.
బంద్ను రెండో శనివారం నాడు ఇచ్చారు. రెండో శనివారం కాబట్టి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సెలవు. అలాగే, ఐటీ సంస్థలు కూడా ఉండవు. అదేవిధంగా పాఠశాలలకు, కళాశాలలకు దసరా, బతుకమ్మ సెలవులు. కొన్ని పాఠశాలలు శనివారం నాడు ఉంటాయి.
అదేవిధంగా, టిఆర్ఎస్ అనుబంధ సంఘాలు చాలా వరకు బందుకు మద్దతు ప్రకటించలేదు. అంతేకాదు, ప్రభుత్వం తీరు బెదిరించే విధంగా ఉంటోందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవాణా సంస్థలు బందుకు ధైర్యం చేయకపోవచ్చునని అంటున్నారు.
గతంలో, మున్సిపల్ ధర్నా నేపథ్యంలో ప్రభుత్వం ఆందోళనలపై తగ్గని పలువురు కార్మికులను తొలగించింది. దీనిని పలువురు గుర్తు చేస్తున్నారు. టిఎస్ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ... బస్సులు నడుస్తాయని చెప్పారు.
ఆశా వర్కర్ల అరెస్ట్
కనీస వేతనాల కోసం పోరుబాట పట్టిన ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నెల రోజులకు పైగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆశా వర్కర్లు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావించారు.
అయితే, ప్రభుత్వం దానికి అనుమతించలేదు. అయినప్పటికీ ఆశా వర్కర్లు జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. గురువారం రాత్రి నుంచే జిల్లాల నుంచి వందలాదిగా బయలుదేరారు. అయితే శాంతిభద్రతల పరిస్థితులను కారణంగా చూపిన పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు.
పోలీసులు అనుమతి ఇవ్వకున్నా సభ చేపట్టి తీరతామని ఆశా వర్కర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందరా పార్కు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లాల నుంచి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
వారితో పాటు వారికి సహకరిస్తున్న కార్మిక సంఘాల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిర్బంధంపై ఆశా వర్కర్లు, కార్మిక సంఘాల నేతలు పోలీస్ స్టేషన్లలోనే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.