'రద్దు'కే మొగ్గు... డిగ్రీ,పీజీ పరీక్షలపై విద్యాశాఖ కీలక చర్చలు.. తుది నిర్ణయం సీఎందే..
తెలంగాణలో డిగ్రీ,పీజీ చివరి సెమిస్టర్ విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేత్రుత్వంలో గురువారం(జూన్ 18) దీనిపై ఉన్నత విద్యా మండలిలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువమంది అధికారులు పరీక్షల రద్దుకే మొగ్గుచూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సరికాదని అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
తెలంగాణ సచివాలయంలో మరో కరోనా పాజిటివ్: అవసరమైతేనే ఉద్యోగుల హాజరు
పరీక్షలు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తికి అవకాశం..
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టవుతుందని విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తాకిడితో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకేసారి వందల మంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రావడం, ప్రశ్నా పత్నాలు,జవాబు పత్రాలు చేతులు మారడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు.
'రద్దు'కే మొగ్గుతున్న మెజారిటీ అధికారులు
వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షల రద్దుకే ఎక్కువమంది అధికారులు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇంటర్నల్ మార్కులు లేదా క్రితం సెమిస్టర్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదికను పరిశీలించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం వెల్లడించనున్నారు.
సీఎంకు నివేదిక...
పరీక్షలు నిర్వహిస్తే తలెత్తే సవాళ్లు,సమస్యలు.. అలాగే పరీక్షలు నిర్వహించకపోతే ఎదురయ్యే సాంకేతిక సమస్యల గురించి విద్యాశాఖ సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఒకవేళ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేస్తే ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలి అన్న అంశాలను కూడా అందులో పొందుపరచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసినందునా.. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులను పాస్ చేస్తే.. వారి బ్యాక్ లాగ్స్ సంగతేంటన్న అంశంపై కూడా విద్యాశాఖ చర్చించినట్టు తెలుస్తోంది.
Recommended Video
రద్దు చేసే అవకాశం..
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనేక తర్జనభర్జనల తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు పరీక్షల రద్దుకే మొగ్గుచూపింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం డిగ్రీ,పీజీ పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అయితే ఉన్నత విద్యా మండలిలో ఎక్కువమంది అధికారులు పరీక్షల రద్దుకే మొగ్గుచూపుతుండటంతో... ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ అవుతారు.