పొట్ట కూటికోసం వలసపోయిన సర్పంచ్ తిరిగొచ్చింది ... ఏం జరిగిందంటే
Recommended Video
నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండా సర్పంచ్ జీవనోపాధి కోసం వలస పోయిన సంఘటన స్థానికంగా చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించింది. తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్న సర్కార్, ఒక సర్పంచ్ గ్రామంలో ఉపాధి లేక వలస పోతే ఏం చేస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే ఈ సంఘటన తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఎర్రగుంట తండా సర్పంచ్ సరోజినీ బాయిని తిరిగి గ్రామానికి రప్పించారు.
వలసపోయిన సర్పంచ్ ను గ్రామానికి రప్పించిన అధికారులు... వలసలపై ఆరా
పొట్టకూటి కోసం ఎర్రగుంట తండా సర్పంచ్ సరోజినీ బాయి ముంబై కి వలస పోయారు. ఇక ఉపసర్పంచ్ పాలమూరు జిల్లాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. వీరే కాదు ఆ గ్రామంలోని చాలా కుటుంబాలు సాగునీరు లేక, తాగునీరు కూడా దయనీయమైన పరిస్థితిలో, ఉపాధి అవకాశాలు మృగ్యమై వలస పోయారు. సర్పంచ్ వలస తో వెలుగులోకి వచ్చిన ఈ ఈ విషయం పై అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక ముంబైకి వలసపోయిన సర్పంచ్ ను హుటాహుటిన గ్రామానికి రప్పించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన ఈ వలస వ్యవహారంపై, గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.ఎప్పుడైతే సర్పంచ్ వలస వ్యవహారం వెలుగులోకి వచ్చిందో అప్పుడు గ్రామస్తులు, బంధువులు జోక్యం చేసుకొని ఊరికి చెడ్డ పేరు రాకూడదని సర్పంచ్ సరోజినీ బాయిని విజ్ఞప్తి చేశారు.
ఆ ఊరి పరిస్థితి ఎంత దారుణం అంటే .. సాక్షాత్తు సర్పంచే వలస పోయేంత
సర్పంచ్ వలసతో సర్కార్ పరువు పోతుందన్న భయం .. ఉపాధి కల్పించాలన్న తండా జనం
ప్రస్తుతం సర్పంచ్ సరోజిని భాయి గ్రామానికి తిరిగి వచ్చినా , ఊరిలో ఉన్న ఉపాధిలేని పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒక గ్రామాన్ని ప్రగతిపథంలో నడిపించాల్సిన సర్పంచ్ గ్రామం వదిలి వెళ్ళిపోయారు అంటే పరిస్థితుల తీవ్రత ఎంతగా ఉందో గమనించాలి. గ్రామస్తులకు జీవనోపాధి కల్పించే దిశగా, గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ఒకవేళ అదే కనుక చేయలేకపోతే తెలంగాణ సర్కార్ పరువు ఆ గ్రామ వలసల సాక్షిగా పోతుంది.