వామ్మో.. ఎన్నికల అధికారుల పేరిటే ఫేక్ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!
హైదరాబాద్: కాదేది మోసానికి అనర్హం అన్నట్టు ఎన్నికల ముఖ్య అదికారులనే టార్గెట్ చేసారు ఫేక్ రాయుళ్లు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్కుమార్, భారత ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఓపీ రావత్ల పేరుతో జారీ అయిన ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారంపై జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు చేతులెత్తేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీరు నాంపల్లి నియోజకవర్గంలో ఉంటున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు తప్పుడు పత్రాలు సమర్పించగా.. వాటి ఆధారంగా రజత్కుమార్, ఓపీ రావత్లకు ఓటరు కార్డులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీసులు ఓటరు గుర్తింపు కార్డుల కోసం ఎవరు దరఖాస్తు చేశారు అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
రజత్కుమార్, రావత్ల పేర్లతో నకిలీ కార్డులు..! రంగంలోకి దిగిన సీసీయస్ పోలీసులు..!!
దరఖాస్తు చేసిన వారి ఐపీ చిరునామాలు తెలపాలంటూ రెండు నెలల నుంచి జీహెచ్ఎంసీ అధికారులను సమాచారం కోరుతున్నా స్పందించడం లేదు. మరోవైపు రజత్కుమార్, రావత్ల పేర్లతోనే ఎందుకు ఓటరు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేశారన్న అంశంపై పరిశోధించిన సీసీఎస్ పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో కార్డుల జారీలో జీహెచ్ఎంసీ ఎన్నిక విభాగం అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ పోలీస్ అధికారులు కోర్టులో అభియోగత్రాలను సమర్పించనున్నారు.
సమాచారం ఇచ్చేందుకు తడబాట్లు..! సమాచారం ఇవ్వడానికి జంకుతున్న ఐటీ అదికారులు..!!
రజత్కుమార్, రావత్ల పేర్లతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు మూడు నెలల క్రితం సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ ఓటరు గుర్తింపు కార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా మెహిదీపట్నం చాచా నెహ్రూ పార్క్ సమీపంలోని ఇంట్లో వారిని పోలీసులు ప్రశ్నించగా తమకేమీ తెలీదని, ఇరవై ఏళ్లుగా అక్కడే ఉంటున్నామని చెప్పారు. దీంతో జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఎవరు దరఖాస్తు చేస్తుకున్నారో చెప్పాలని కోరగా, ఐటీ విభాగం అధికారులు తడబడుతున్నారు. దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది తెలిస్తే దర్యాప్తు వేగవంతం అవుతుందని వారికి చెప్పినా.. చెప్పేందుకు ఇష్టపడడం లేదని పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక అంశాలు, మరింత సమాచారం ఐటీ విభాగం అధికారులు ఇవ్వనందునా చట్టపరంగా వారిపై చర్యలు చేపట్టారు.
ఓటరు కార్డుల జారీ ఇలా..! లోపాలు ఎన్నో..!!
ఆన్లైన్లో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారులకు ఒక గుర్తింపు అంకెను ఇస్తారు. దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, సంబంధిత పత్రాల ఆధారంగా విచారణ చేపడతారు. అనంతరం దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు, విచారణ సిబ్బంది వస్తారు. వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక ఒక నివేదికను రూపొందించి అర్హులైన వారికి ఓటరు గుర్తింపు కార్డును జారీచేస్తారు.
కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించనున్న సీసీఎస్ పోలీసులు..! దరఖాస్తు చేసిన వారికి కఠిన శిక్షలు..!!
జారీ చేసిన సమాచారాన్ని దరఖాస్తుదారుడి మొబైల్ లేదా ఈ-మెయిల్కు పంపుతారు. ఆ సమాచారం ఆధారంగా మీ-సేవలో ఓటరు గుర్తింపు కార్డులను దరఖాస్తుదారులు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ ప్రక్రియలో లోపాలుండడం వల్ల పదుల సంఖ్యలో అనర్హులకు ఓటరు గుర్తింపు కార్డులు లభిస్తున్నాయి.ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్కుమార్, భారత ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఓపీ రావత్ల పేరుతో నకిలీ కార్డులు జారీ అవ్వడంతో ఉలిక్కి పడ్డ యంత్రాంగం నష్టనివారణ చర్యలకు పూనుకుంది.