వామ్మో.. కవిత ప్రత్యర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజకీయం..!!
Recommended Video
నిజామాబాద్/హైదరాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కోసం వినూత్నంగా నిజామాబాద్ రైతులు నిరసన తెలుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు దేశం దృష్టి నిజామాబాద్పై పడింది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి కానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
నామినేషన్ వేసిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పిరమిడ్, బహుజన ముక్తి, సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా, మిగతా వారంతా రైతులే కావడం గమనార్హం. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై పోటీ చేసేందుకు బరిలోకి దిగారు.
లోకసభ ఎన్నికలు 2019: జోరుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం
దీంతో ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న అదికార గులాబీ పార్టీ, రైతులు వేసిన నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించింది. సమస్యలు పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని, బరిలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో నిజామాబాద్ లోక్ సభ పోరుపై అందరి ద్రుష్టి నెలకొంది.