వామ్మో..ఒక్కసీటుకు 33 మంది అభ్యర్థులా..? కాంగ్రెస్ రూటే సెపరేటు..!!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా విచిత్రంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో నైతే ఆశావహుల ప్రవర్తన మరింత పరాకాష్టగా ఉంటుంది.కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధులకు సీటు కేటాయిస్తే ఒక లెక్క, కేటాయించకపోతే మరో లెక్క అన్నచందంగా ఉంటుంది ఆపార్టీలో పరిస్థితి. ఇక రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోటీ చేసేందుకు అభ్మర్థులు పెద్ద మొత్తంలో పోటీ కనబరుస్తుంటారు. కాంగ్రెస్ అదిష్టానమే ఆశ్యర్యపోయేంతగా అభ్యర్థలు ముందుకు వస్తారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుండడం విశేషం. ఇక ఎమ్మెల్యే కోటా నుండి ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్తి సొంతం చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో ఆశావహులు భారీ సంఖ్యలో ధరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం 33 మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పోటీపడడంతో కాంగ్రెస్ పెద్దలే ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఒక అభ్యర్థి పోటీ చేసేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉంది. ఇందుకోసం సీఎల్పీ సబ్ కమిటీ నియమించారు. ఈరోజు సబ్ కమిటీ సమావేశమై పరిశీలించగా సుమారు 33 మంది పోటీపడుతున్నట్లు తేలింది.
33 మంది దరఖాస్తులను పరిశీలించిన సబ్ కమిటీ 10 మందితో జాబితాను రూపొందించింది. మంగళవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పోటీ వాతావరణాన్ని చూసి టీపిసిసి సంబ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.