క్యాబ్ డ్రైవర్ ను బెదిరించి.. నగదుతో పాటు కారుతో ఉడాయించారు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని సూరారం కాలనీ సమీపంలో ఓలా క్యాబ్ డ్రైవర్ ను నిలువునా దోచేసుకున్నారు గుర్తు తెలియని అగంతకులు. క్యాబ్ లో ఎక్కినవాళ్లు కాస్త.. బెదిరింపులకు దిగి నగదు, సెల్ ఫోన్ లాక్కుని క్యాబ్ తో ఉడాయించడంతో క్యాబ్ డ్రైవర్ కంగు తిన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపరంలో కొంతమంది వ్యక్తులు ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. దీంతో వారిని పికప్ చేసుకుని సూరారం వైపుగా వెళ్తున్నాడు క్యాబ్ డ్రైవర్. ఇంతలో సూరారం సమీపంలోకి చేరుకోగానే కారులో ఉన్న అగంతకులు డ్రైవర్ ను బెదిరించి నగదుతో పాటు సెల్ ఫోన్ లాగేసుకున్నారు.
అనంతరం డ్రైవర్ ను కిందకు దించేసి.. అదే క్యాబ్ లో అక్కడినుంచి ఉడాయించారు. కాగా, కారును బొంగులూరు గేట్ సమీపం నుంచి వెళ్తుండగా గుర్తించినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో కారు యాక్సిడెంట్ కు గురికావడంతో కారును అక్కడే వదిలి దుండగులు పరారైనట్లుగా సమాచారం. ప్రస్తుతం బాధితుడి ఫిర్యాదు మేరకు దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకుముందు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులే ఇప్పుడు ఈ చోరికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.