'ఏటీఎంల నుంచి పాత నోట్లు వస్తున్నాయి, నరేంద్ర మోడీ పతనం ఖాయం'
హైదరాబాద్: బ్యాంకులకు వెళ్తే చిల్లర డబ్బులు ఇవ్వడం లేదని, ఏటీఎంలకు వెళ్తే పాతనోట్లు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
పాత కరెన్సీ రద్దు చేసిన నరేంద్ర మోడీ పైన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్లధనం విషయంలో మోడీ మాటలకు, ప్రజల ఆలోచనలకు చాలా తేడా ఉందని చెప్పారు.
నోట్ల రద్దు విషయమై ఇబ్బందులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడటం కాదని, ప్రజలలోకి వెళ్తే ఇబ్బందులు తెలుస్తాయని వీ హనుమంత రావు నిప్పులు చెరిగారు. ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాగా, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు, చెక్కులను మార్చుకునేందుకు మంగళవారం బ్యాంకుల వద్ద పెద్దసంఖ్యలో జనం బారులు తీరారు. చాలాచోట్ల నగదు మార్చుకోడానికి గంటలపాటు లైన్లో నిలుచుకున్నారు. కౌంటర్ వద్దకు చేరలేని పరిస్థితి.ట
సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో, మంగళవారం విపరీతమైన రద్దీ కనిపించింది. ఏటీఎంలు అన్ని పని చేయడం లేదు. ఒకవేళ డబ్బులు వేసినా అవి ఎక్కువసేపు ఉండటం లేదు. సదుపాయాలు బాగా ఉన్న హైదరాబాద్లోనే ఏటీఎంల పనితీరు మెరుగుపడలేదు.
రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమవంతు వచ్చేసరికి ఏటీఎంలో డబ్బులు ఉంటాయో, లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో డబ్బులు బాగా అవసరం ఉన్న కుటుంబాలవారు తమ పనులను పక్కన పెట్టి, ఒక్కొక్కరు ఒక్కో ఏటీఎంల వద్ద నిరీక్షించారు.