కరోనా వైరస్ : ఐసోలేషన్ వార్డులో వ్యక్తి మృతి.. మృతదేహాన్ని తాకిన 11 మంది..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఓ వృద్దుడు(62) మృతి చెందాడు. అంతకుముందు కరోనా పాజిటివ్గా తేలిన ఓ వృద్దుడు ఇతన్ని కలిసినట్టు తెలియడం.. అనుమానిత లక్షణాలు బయటపడంతో అతన్ని కూడా ఐసోలేషన్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆ వృద్దుడు మృత్యువాతపడ్డాడు.
మృతి విషయం తెలిసిన వృద్దుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపించారు. ఈ క్రమంలో కొంతమంది వైద్య సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. మరోవైపు అతను గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. హైదరాబాద్కు తరలించే క్రమంలో మృత్యువాతపడ్డట్టు చెప్పారు. మృతదేహాన్ని తాకిన 11మంది అతని కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్కు తరలించినట్టు సమాచారం. మృతుడి రక్త నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 70 ఉన్నాయని మరో 11 మంది కోలుకున్నారని ఆదివారం(మార్చి 29) ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ముందు జాగ్రత్త కోసం మరోసారి టెస్టులు నిర్వహించారని.. అందులోనూ నెగటివ్ అని తేలితేనే వారిని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం 25,937 మంది క్వారెంటైన్లో ఉన్నారని చెప్పారు. మార్చి 30లోగా 1899 మందికి క్వారంటైన్ ముగుస్తుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) నాటికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 మంది మృత్యువాతపడ్డారు. లాక్ డౌన్ పూర్తయ్యే సరికి పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.