అర్ధరాత్రి 2గంటలకు... ఆ 2 గ్రామాలతో హైదరాబాద్ పోలీసుల యుద్దం.. సినిమాను తలపించిన సీన్..
ఓఎల్ఎక్స్ ప్రకటనలతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న రాజస్తాన్ భరత్పూర్ సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా ఈ ముఠాలపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో... ఏకంగా రాజస్తాన్కు వెళ్లి మరీ వీరిని అరెస్ట్ చేశారు. అయితే ఇందుకోసం పోలీసులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ ముఠాలను అరెస్ట్ చేసేందుకు అక్కడి రెండు గ్రామాల ప్రజలతో యుద్దమే చేయాల్సి వచ్చింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాలను సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు.
ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠా...
రాజస్తాన్ భరత్పూర్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఓఎల్ఎక్స్, క్వికర్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుని మే,2018 నుంచి ఇప్పటివరకూ దేశంలో ఎంతోమందిని ఈ ముఠాలు బురిడీ కొట్టించాయి. వాహనాలు,ఫోన్లు,ఫర్నీచర్,ఎలక్ట్రానిక్ వస్తువులు... ఇలా ఏదైనా వస్తువును మొదట ఈ గ్యాంగ్ ఓల్ఎక్స్ తదిరత ప్లాట్ఫామ్స్లో విక్రయానికి పెడుతారు. నిజానికి వాళ్ల వద్ద ఆ వస్తువేదీ ఉండదు... కానీ అమాయకులకు టోకరా వేసి డబ్బులు దండుకునేందుకు ఈ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటారు.
అందినకాడికి దోచుకుంటారు...
ఆన్లైన్ వేదికల్లో ఆ వస్తువుల అమ్మకానికి సంబంధించిన యాడ్స్ను చూసి... ఎవరైనా తమను సంప్రదిస్తే... తాము ఆర్మీ లేదా సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నట్లు ఈ గ్యాంగ్ నమ్మబలుకుతారు. ఆర్మీ వ్యక్తులంటే ప్రజల్లో ఉండే గౌరవం,పైగా అనుమానానికి అసలు తావే ఉండదన్న ఉద్దేశంతో ఆ పేరును వాడుతారు. వారి నమ్మకాన్ని మరింత బలపరిచేందుకు నకిలీ ఆర్మీ ఐడీ కార్డులను కూడా వాట్సాప్లో పంపిస్తారు. తక్కువ ధరకే వస్తువును విక్రయిస్తామని చెప్పడంతో కస్టమర్స్ కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో.. ఆ వస్తువును డెలివరీ చేశామని,అది మీ ఇంటికి చేరాలంటే గోడౌన్ గేట్ పాస్,ట్రాన్స్పోర్ట్,ఇన్సూరెన్స్ తదితర డెలివరీ చార్జీలు చెల్లించాలని నమ్మబలుకుతారు. అలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా అందినకాడికి కాజేస్తారు.
ఈ నెల 9న 8మంది అరెస్ట్...
గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఈ గ్యాంగ్ నేరాలు పెరిగిపోవడంతో ఇక్కడి పోలీసులు భరత్పూర్ ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఓఎల్ఎక్స్ సైబర్ చీటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అక్కడి పోలీసులు... ఇలాంటి నేరాలను ఆ గ్యాంగ్స్ కుటీరపరిశ్రమగా మలుచుకున్నట్లు గుర్తించారు. మొదట 8 మందిని అరెస్ట్ చేసి 800 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో పలువురిని వీరు మోసం చేసినట్లు గుర్తించారు. దీనిపై హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో... ఇక్కడి పోలీసులు రాజస్తాన్ వెళ్లి పీటీ వారెంట్పై 8మందిని అరెస్ట్ చేసి ఈ నెల 9న వారిని నగరానికి తీసుకొచ్చారు.
Recommended Video
ఆ 2 గ్రామాలతో పోలీసుల యుద్దం...
మరో నాలుగు కేసుల్లోనూ పక్కా ఆధారాలు ఉండటంతో ఆయా గ్యాంగ్లను అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రాజస్తాన్ వెళ్లారు. భరత్పూర్ ఎస్పీ సహకారంతో స్థానిక పోలీసులతో కలిసి 20 వాహనాల్లో 100 మంది సిబ్బంది ఆయుధాలు,టియర్ గ్యాస్తో చుల్హెర, కల్యాన్పుర గ్రామాలకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 2గంటలకు పోలీసులు అక్కడికి చేరుకోగా... అప్పటికే పోలీసుల రాకను గుర్తించిన గ్రామస్తులు వారిపై రుళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు పోలీసుల కళ్లల్లో కారం పొడి చల్లారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. అనంతరం 10 మంది నిందితులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు.వీరి నుంచి 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడినుంచి ఈ ముఠాను హైదరాబాద్ తరలించారు.