నిరుద్యోగంపై గళమెత్తనున్న కోదండరామ్..! పాలమూరుకు డేట్ ఫిక్స్
హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై గళమెత్తడానికి సిద్దమవుతున్నట్టు ప్రకటించారు ప్రొఫెసర్ కోదండరామ్. ఓవైపు ప్రాజెక్టుల సందర్శనకు సిద్దమవుతూనే మరోవైపు భవిష్యత్తు కార్యచరణపై ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారాయన. ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫోకస్ చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఈ నెల 21, 22 తేదీల్లో పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నట్టు ప్రకటించారు.
గురువారం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన కోదండరామ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా.. ప్రభుత్వ రీడిజైనింగ్ ల గురించి ప్రస్తావించిన ఆయన, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, నిపుణులను సంప్రదించకుండా, ప్రభుత్వమే ప్రాజెక్టుల డిజైన్ లను నిర్ణయిస్తోందని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు తరహాలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎత్తు కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోదండరామ్. ఎత్తు తగ్గించడం ద్వారా ముంపు తీవ్రత తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశం సందర్బంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి చర్చించినట్టు చెప్పిన ఆయన, దీనిపై ఆగస్టు తొలివారంలో హైదరాబాద్ లో సదస్సు,ను నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు.
అలాగే రాష్ట్రంలోని ఇతర సమస్యలయిన ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం, జెన్ కో ప్రాజెక్టుల భూసేకరణ వంటి అంశాలు కూడా తాజా సమావేశంలో చర్చకు వచ్చినట్టు కోదండరామ్ వివరించారు. అలాగే రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యుత్ వినియోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ త్వరలోనే ఓ పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్టుగా తెలియజేశారు.