వివాదంలో మళ్లీ బాసర ఆలయం.. అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం
బాసర : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం.. వివాదాల సుడిగుండంగా మారుతోంది. అప్పట్లో రాజగోపురం కలశాలు మాయం కావడం పెద్ద దుమారమే రేపింది. అంతకుముందు సాక్షాత్తు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని.. ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి తరలించడం వివాదస్పదమైంది. అలా ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్న తీరు భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. తాజాగా అమ్మవారి మూల విరాట్ విగ్రహం పైనున్న మకుటంలోని నవ వజ్రాల్లో ఒకటి కనిపించకుండా పోవడం ఆందోళనకు దారితీసింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఓటింగ్ సిరాచుక్క మిడిల్ ఫింగర్కు చేరింది.. బూతులా మీనింగ్ మారింది.. నెట్టింట్లో కాంట్రవర్సీ
అపచారం.. వజ్రం మాయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయం.. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అమ్మవారి మూల విరాట్ విగ్రహం పైనున్న కిరీటంలో ఓ వజ్రం మాయం కావడం దుమారం రేపుతోంది. రోజువారీ అభిషేకాలు, పూజల్లో భాగంగా ఎక్కడో పడిపోయి ఉండొచ్చంటూ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. నవ వజ్రాలు ఉన్న కిరీటంలో ఒకటి కనిపించకుండా పోవడంతో.. అలాగే అసంపూర్తిగా అమ్మవారికి కిరీటం అలంకరించడం అపచారమంటూ కొందరు వాదిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో ఏటా కోట్లాది రూపాయల ఆదాయమున్నా కూడా.. దేవాదాయ శాఖ కిరీటం చేయించలేదనే అపవాదు మూటగట్టుకుంది. ప్రస్తుతమున్న కిరీటం అప్పుడెప్పుడో పదేళ్ల కిందట హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి కానుకగా ఇచ్చినట్లు సమాచారం. అదలావుంటే వజ్రం కనిపించకుండా పోయి రాద్ధాంతం జరుగుతున్నా.. ఆలయ అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే విషయం కాస్తా మీడియాలో కథనాలుగా రావడంతో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
2018లో ఏమి జరిగింది?
2018, జూన్ లో జరిగిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజగోపురాలకు మరమ్మతులు చేసే క్రమంలో వాటిపై ఉంచే కలశాలు మాయం అయ్యాయనే వార్త సంచలనం సృష్టించింది. ఏమైందని ఆలయ అధికారులను ఆరా తీస్తే విస్తుపోయే సమాధానం చెప్పారట. రెండు రాజగోపురాలపై ఉండాల్సిన కలశాలను కోతులు ఎత్తుకెళ్లినట్లు చెప్పడం విస్మయానికి గురిచేసిందంటారు కొందరు. అంత నిర్లక్ష్యంగా సమాధానం ఎలా చెబుతారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆరోపణలు చుట్టుముట్టినా కూడా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపించాయి. పంచలోహ కలశాలు మాయం కావడం అపచారమని భక్తులు ఆందోళన చెందారు.
2017 వివాదం.. పెద్ద ఎత్తున దుమారం..!
ఇక 2017, ఆగస్టులో జరిగిన మరో సంఘటన ఆలయ సిబ్బంది తీరుకు పరాకాష్టలా మిగిలింది. సరస్వతి దేవి ఉత్సవ విగ్రహం కనిపించకుండా పోవడం.. అది కాస్తా ఆలయ ప్రధాన అర్చకుడి బీరువాలో లభ్యం కావడం.. అదంతా కూడా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా తయారైంది పరిస్థితి. అంతేకాదు ఆ ఉత్సవ విగ్రహాన్ని దేవరకొండలోని ఓ ప్రైవేట్ స్కూలుకు తరలించడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. జూన్ చివరి వారంలో ఆ పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాసం కార్యక్రమానికి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ ను అప్పటి ఘటనకు బాధ్యుడిని చేస్తూ విధుల్లోంచి తొలగించారు.
వజ్రం మాయం ఎవరి పని.. దేవాదాయ శాఖ స్పందించేనా?
చిన్నారులను పాఠశాలకు పంపించే క్రమంలో ఇక్కడి అమ్మవారి సన్నిధిలో వారికి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని చదువులో రాణించాలని ప్రత్యేక పూజలు చేయించడం ఆనవాయితీ. భక్తజనులతో ఎప్పుడూ కిటకిటలాడే బాసర అమ్మవారి ఆలయానికి ప్రతి ఏటా భారీగానే ఆదాయం సమకూరుతోంది. అయితే దేవాదాయ శాఖ ఏనాడు కూడా ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవనేది భక్తుల మాట. అదలావుంటే అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాశారు.