మరోసారి డీఎస్ రాజకీయ చతురత..! కేసీఆర్ టార్గెట్ గా బీజేపి విసిరిన బాణమేనా..?
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ మరోసారి రాజకీయ సంచలనంగా మారారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ అసమ్మతి నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సుదీర్ఘ అజ్ణాత వాసం నంచి ఒకేసారి ఊడి పడ్డట్టుగా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రావడంతో మిగతా ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు అవాక్కయ్యారట, ఆలోచనలో పడ్టారట.
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్, నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడికి డీఎస్ మద్దతిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చిన డీ శ్రీనివాస్ పై, ఎన్నికలకు ముందే వేటు వేయాలని తన తండ్రి కేసీఆర్ ను కవిత కోరారు. ఆ పరిణామాల నేపథ్యంలో, బీజేపీలోకి డీఎస్ వెళతారని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ మారకపోయినప్పటికీ, గులాబీ గూటికి దూరమయ్యారు. ఇప్పుడిలా అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
గులాబీ తెరమీదకు డీఎస్..! ఉలిక్కిపడుతున్న టీఆర్ఎస్ నేతలు..!!
చంద్రశేఖర్ రావు, డీఎస్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి డీఎస్ పై ఫిర్యాదులతో నాలుగు పేజీల లేఖ రాశారు. దీనిపై అప్పట్లో డీఎస్ మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు సంజయ్ ను ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుటుంబాన్ని కావాలనే ఇబ్బందిపెట్టారని కూడా అప్పడు డీఎస్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో డీఎస్ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు (డీఎస్సే చేర్పించారన్నది ఆరోపణ, అనుమానం). ఆ తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్, కవితను ఓడించారు.
గత కొంతకాలంగా అంటీముట్టనట్టు డీఎస్..! సడెన్ రీఛార్జ్ కారణం ఏంటంటున్న గాలాబీ నేతలు..!!
చంద్రశేఖర్ రావు కు, టీఆర్ఎస్ కు పూర్తిగా దూరమైన డీఎస్ ఇప్పుడిలా పార్టమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని టీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు. డీఎస్ తాజా చర్యతో ఆయన ప్రస్తుతానికి బీజేపీలో చేరకపోవచ్చని భావిస్తున్నారు. అయితే... టీఆర్ఎస్ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా డీఎస్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి డీఎస్ అనూహ్య రాకతో టీఆర్ఎస్ నేతలు షాకయ్యారట. ఆయన ఇప్పటివరకూ చేసినవన్నీ పాలి 'ట్రిక్సే'. ఎన్నికలకు ముందు, తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి టీఆర్ఎస్ ఓట్లు చీల్చడం, తన కుమారుడిని బీజేపీలోకి పంపించడం, టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు వ్యతిరేకంగా అరవింద్ కు మద్దతునివ్వడం, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం, ఇవన్నీ డీఎస్ పాలి 'ట్రిక్స్' లో భాగమే నని టీఆర్ఎస్ పెద్దలు అనుమానానిస్తున్నారట.
బీజేపి ప్రయోగించిన అస్త్రమా..! పార్టీ మీద అభిమానమా..!!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే... మళ్లీ డీఎస్ కాంగ్రెస్లో చక్రం తిప్పుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. డి.శ్రీనివాస్ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపిన డీఎస్... తాను మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే...తన రాజ్యసభ సభ్యత్వం పోతుందనే కారణంగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఎదుర్కొన్న ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు.
డీఎస్ ప్రణాళిక ఎంటి..! కేసీఆర్ కు అనుకూలమా.. వ్యతిరేకమా..?
అలాంటి సంజయ్ బుధవారం టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంపీ కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై జిల్లా రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మళ్లీ తాను టీఆర్ఎస్లో పని చేస్తానని డీఎస్ కుమారుడి ద్వారా కవితకు సమాచారం పంపించారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు బీజేపీ తరపున డీఎస్ రెండో తనయుడు అరవింద్ నిజామాబాద్ లోక్సభకు పోటీ చేయరనే హామీ ఇస్తే... డీఎస్ను టీఆర్ఎస్ మళ్లీ అక్కున చేర్చుకునే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.