పోలీసుల కాల్పులు: చైన్ స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన పోలీసు కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చిక్కినట్టే చిక్కి చేజారిన నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ఎక్కడికక్కడ గాలిస్తున్నారు.
అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో బైక్పై వెనుక కూర్చున్న ఒకరికి బులెట్ట గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆటోనగర్ నుంచి చింతల్కుంట, సాగర్ రింగ్ రోడ్డు, కర్మన్ఘాట్ మీదుగా కంచన్బాగ్ వైపు స్నాచర్లు పరారైనట్లు సమాచారం.
దీంతో ఆయా మార్గాల్లో ఉన్న అన్ని ఆసుపత్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నిందితులు చికిత్స పొందుతూ ఉండొచ్చన్న అనుమానంతో అన్ని ఆసుపత్రులను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వనస్థలిపురం అటోనగర్లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు యత్నిస్తున్న దుండగులపై అక్కడే వున్న యాంటి చైన్స్నాచింగ్ టీం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
సోమవారం ఉదయం సంచలనం సృష్టించి సంఘటన వివరాల్లోకి వెళితే.. హుడా సాయినగర్లో నివాసం ఉండే అనురాధ(38) భర్తతో కలిసి ఆటోనగర్లో హోటల్ను నిర్వహిస్తోంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తుండగా వెనుకనుండి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసును అపహరించుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడే మఫ్టిలో ఉన్న యాంటి స్నాచింగ్ టీం పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోవడంతో వారిపై కాల్పులు జరిపారు. అయితే, చైన్ స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు.