ఒకరోజు లీవ్ ఎఫెక్ట్ ... మంథని మునిసిపల్ కమీషనర్ పై సస్పెన్షన్ వేటు.. ఆసక్తికర చర్చ
తెలంగాణాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఇక అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య రక్షణకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది . ఇక ఈ నేపధ్యంలో విధులను నిర్వహించకుండా ఒక్క రోజు సెలవు తీసుకున్నందుకు మంథని మునిసిపల్ కమీషనర్ పై సస్పెన్షన్ వేటు వేసింది మునిసిపల్ శాఖ .
హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో లీవ్ పెట్టిన మంథని మున్సిపల్ కమీషనర్
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడు అధికారులకు తిప్పలు తెచ్చి పెడుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కమిషనర్పై వేటు పడేలా చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న సమయంలో లీవ్ పెట్టటం ఆ కమీషనర్ పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో పరిస్థితి తెలిసి కూడా ఇక లీవ్ పెట్టారన్న కారణంతో ఇవాళ మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామిని సస్పెండ్ చేశారు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ.
కరోనా వైరస్ ఉన్న అత్యవసర సమయంలో సెలవు ఫలితం .. విధుల నుండి సస్పెండ్
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పని చెయ్యాల్సిన అధికారి అది విడిచిపెట్టి నిన్న లీవ్ పెట్టటంతో ఆగ్రహించిన సర్కార్ ఆయనపై వేటు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెట్టిన కారణంతో విధుల నుండి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్గా మంథని ఎమ్మార్వో అనుపమరావును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరో పక్కన మరోవైపు వైన్ షాప్ లు సీజ్ వ్యవహారం ఆయన సస్పెన్షన్ కు కారణం అని భావిస్తున్నారు.
వైన్ షాప్ లు సీజ్ చేశారన్న కారణమా ? స్థానికంగా చర్చ
రాష్ట్ర మంత్రులు, అధికారుల ఆదేశాల మేరకు ఆస్తిపన్ను లక్ష్యం చేరుకోవాలన్న ఆతృతలో నిన్న వైన్ షాప్ ల నుండి రావాల్సిన షాప్ లైసెన్స్ రుసుము వసూలు చేసే క్రమంలో కమిషనర్ లేకుండానే శానిటేషన్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో వైన్ షాప్ లు సీజ్ చేశారు. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కీలకంగా ఉన్న వైన్ షాప్ ల సీజ్ అంశాన్ని సీరియస్గా తీసుకొన్న ఆ శాఖ కమిషనర్ మరియు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ సూచనల మేరకు సస్పెండ్ చేసినట్టు సమాచారం.
Recommended Video
సంవత్సర కాలంగా మంథని మునిసిపాలిటీలో కీలకంగా పని చేసిన కమీషనర్ మల్లికార్జున స్వామి
మంథని మున్సిపల్ కమిషనర్ గా ఫిబ్రవరి25వ తేదీ 2019న విధుల్లో చేరిన గుట్టల మల్లికార్జున స్వామి గతంలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ లో పని చేశారు. ఏడాది కాలంగా మంథని మున్సిపల్ కమిషనర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. మున్సిపాలిటీకి కమిటీ లేని సమయంలో అనేక నిర్ణయాలతో స్వచ్ఛ మంథనిగా తీర్చిదిద్దారనే పేరుంది. ఇక ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో నూతన పాలకవర్గం కొలువుతీరింది. ఇక నూతన పాలక వర్గం వచ్చిన 50 రోజుల్లోనే కమీషనర్ సస్పెండ్ కావడంతో ఇందులో ఏదో మతలబు ఉంది అనే చర్చ జరుగుతుంది.