తెలంగాణలో బస్సు పోయింది.. మహరాష్ట్రలో తుక్కు దొరికింది !
హైదరాబాద్ : సీబీఎస్ పరిధిలోని గౌలిగూడలో నైట్ హాల్ట్ చేసిన బస్సు నామరూపాలు లేకుండా పోయింది. తుప్రాన్ మీద బస్సు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజీ చూసి .. ఆచూకీ కోసం అధికారులు నాందేడ్ వెళ్లారు. అయితే మహాముదురు అయిన కేటుగాళ్లు బస్సు ఫిజికల్ షేప్ మాత్రమే ఉంచారు. ఇంజిన్, ఇతర విడి భాగాలను అమ్మి సొమ్ముచేసుకున్నారని అర్థమవుతోంది. ఎక్కడ దొరికిపోతామనుకున్నారో ఏమో కానీ బస్సును తగులబెట్టి తమ పైత్యాన్ని బయటపెట్టుకున్నారు.
షెడ్డులో బస్సు ..
తుప్రాన్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నాందేడ్ వరకు వెళ్లారు ఆర్టీసీ అధికారులు. అక్కడ ఓ షెడ్డులో బస్సును ధ్వంసం చేస్తున్నారు. అధికారులను చూసిన కాలాంతకులు పలాయనం చిత్తగించారు. కోడి బూరు పీకి చారు కాసినట్టు ఒక్కరోజులోనే బస్సు విడి భాగాలు, విలువైన పార్ట్స్ తీసేశారు. ఫిజికల్ షేప్ మాత్రమే ఉంచారు. అదీ కూడా తెలిసిపోతుందని తగులబెట్టారు కాలాంతకులు. ఆ షెడ్డు యజమానిని ప్రశ్నించి .. అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కరోజులోనే ...
గౌలిగుడ బస్ స్టాప్ వద్ద బస్సు కనిపించకపోవడం సంచలన రేకెత్తించింది. మంగళవారం రాత్రి బస్సును దోచుకెళ్లిన దుండగులు బుధవారం నాందేడ్ తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గురువారం అక్కడికి వెళ్లేసరికి బస్సును బూరు పీకి చారు కాసేశారు దుండగులు. కేవలం ఒక్కరోజులోనే నామరూపం తెలియకుండా చేసేశారు దుండగులు.
భద్రతా ప్రశ్నార్థకం
ఆర్టీసీ బస్సులకు భద్రతా ఉంటుందని .. ఇంజిన్ లాక్ ఉంటుందని కార్పొరేషన్ చెబుతోంది. అయితే ఏకంగా ఒక బస్సు చోరీకి గురవడం .. దాని స్పేర్ పార్ట్స్ ను ఎక్కడికక్కడ విడదీసి అమ్మేయడంతో ... ఆర్టీసీ బస్సుల భద్రత ప్రశ్నార్థకం అని స్పష్టమవుతోంది. తాజా ఈ ఘటనతో మిగతా ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏంటనే చర్చకు దారితీసింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సదరు కార్పొరేషన్ అధికారులపై ఉంది.
గతంలో రెండు బస్సులు
2016లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రెండు బస్సులు చోరీకి గురయ్యాయి. తాజా ఘటనతో ఆర్టీసీ బస్సులకు భద్రత లేకుండా పోయిందని మరోసారి స్పష్టమైంది. ఆర్టీసీ బస్సుల భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిగతా బస్సుల భద్రతా ప్రశ్నార్థకం మారే ప్రమోదం ఉంది.