ఆటోను ఢీకొట్టిన యాంకర్ లోబో కారు?: నుజ్జునుజ్జు.., ఒకరి మృతి!
Recommended Video
రఘునాథపల్లి: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఓ టీవి చానెల్ యాంకర్ అయిన ఖయ్యూం అలియాస్ లోబో అతి వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు పేర్కొన్నారు.
నిడిగొండ వద్ద రోడ్డు ప్రమాదం:
టీవి యాంకర్ లోబో.. మా టీవి ప్రోగ్రాం ప్రొడ్యూసర్ వంశీప్రియ, మరో వ్యక్తితో కలిసి హనుమకొండ నుంచి హైదరాబాద్ కి కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో నిడిగొండ వద్ద జనగామ నుంచి రఘునాథ్ పల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లోబో కారు ఢీకొట్టింది. అయితే రెండు వాహనాలు అతివేగంగా ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు.
నుజ్జునుజ్జయిన ఆటో..:
ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా.. కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర రక్తస్రావం జరిగింది. గాయపడ్డవారిలో ఆటోడ్రైవర్ మాచర్ల లక్ష్మినారాయణ సహా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్కు చెందిన మేడె కుమార్, ఆయన తల్లి మేడె ఎల్లమ్మ, యాదాద్రి- భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన నీర్మాల మనెమ్మ, ఆమె భర్త నర్సయ్య, రఘునాథపల్లి ఏఈవో కరుణాకర్ ఉన్నారు.
లోబో సేఫ్.., ఆటో ప్రయాణికుడి మృతి:
ప్రమాద సమయంలో లోబో ప్రయాణిస్తున్న కారు బెలూన్లు తెరుచుకోవడంతో వారు ప్రాణాలు బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆటో ప్రయాణికుడు మేడె కుమార్(25) జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆటో డ్రైవర్ లక్ష్మినారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులకు పోలీసుల రక్తదానం:
జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు సీపీ మల్లారెడ్డి, రఘునాథపల్లి రూరల్ సీఐ చంద్రశేఖర్గౌడ్ రక్తదానం చేశారు. పోలీసులు రక్తదానం చేసి క్షతగాత్రులు ప్రాణాలు కాపాడటంతో పలువురు వారిని అభినందించినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.