మద్యం మత్తులో గొడవ, మూడో అంతస్తు నుంచి తోసిన ఇద్దరు, మేస్త్రీ మృతి
వైన్ షాపులు తెరిచిన సంబురంలో మందు కొనుగోలు చేసి.. కడుపునిండా తాగారు. ఇంకేమంది తర్వాత గొడవనే కదా.. అలా ముగ్గురు గొడవ పడగా ఒకరు చనిపోయారు. వరంగల్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘర్షణ జరిగింది. మద్యం సేవిస్తూ.. మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. వారి మధ్య పాత గొడవలు ఉన్నాయనే అంశం పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాకు చెందిన 10 మంది వలస కూలీలు భవన నిర్మాణంలో వరంగల్లో మేస్త్రీలుగా పనులు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల వైన్ షాపులు మూసివేసి ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఓపెన్ కావడంతో ముగ్గురు నగదు తీసుకొని మందు కొనుగోలు చేశారు. లిక్కర్ కొనుగోలు చేసేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నారు. తర్వాత హన్మకొండ బస్టాండ్ సమీపంలోని నిర్మాణం మద్యలో ఆగిపోయిన ఓ భవనంలో మద్యం సేవించారు. అలా ఉండగా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. వారిలో ఇద్దరు మరో వ్యక్తిని మూడవ అంతస్తు నుంచి కిందకు నెట్టివేశారు. కింద పడ్డ మేస్త్రీ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.