సింగరేణి కార్మికులకు బోనస్ గా లక్ష రూపాయలకు పైగా బంపర్ బొనాంజా.. ఇక పండుగే పండుగ !!
ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశమంతా దీపావళి పండుగ కళ తప్పితే సింగరేణి కార్మికుల ఇళ్లల్లో మాత్రం దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి ఈసారి సింగరేణి కార్మికులను సంతోషంలో మునిగిపోయేలా చేశాయి. అందుకు కారణం బోనస్ రూపంలో ఒక్కొక్క కార్మికునికి లక్ష రూపాయలకు పైగా అందాయి. అదెలాగంటే
దసరాకు బోనస్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం .. ఇప్పుడు దీపావళికి కూడా
సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తున్న నేపద్యంలో ఊహించని విధంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బోనస్ల బొనాంజా సింగరేణి కార్మిక కుటుంబాలను సంతోషం వెల్లివిరిసేలా చేసింది. సింగరేణి సంస్థ ఇటీవలే రూ.494 కోట్ల లాభాలను కార్మికులకు బోనస్గా పంపిణీ చేసింది. దసరా పండగ ముందు ఈ బోనస్ కార్మికులు, ఉద్యోగులకు అందాయి. ఇక మరోమారు దీపావళి సందర్భంగా తాజాగా పంపిణీ చేసిన బోనస్తో కలుపుకొని కార్మికులకు ఒక్కొక్కరికి ఈ ఏడాది లక్ష రూపాయలకు పైగా పంపిణీ చేసినట్లైంది. దీనికి అదనంగా కొంత మంది కార్మికులకు అడిగినంతనే అడ్వాన్స్ సాలరీలు కూడా చెల్లించారు అధికారులు. ఇది కూడా కలుపుకుంటే చాలా మంది కార్మికులు రూ.లక్షన్నరకు పైగా దసరా, దీపావళి పండుగ సందర్భంగా పొందారు.
Recommended Video
లాభాల బాటలో సింగరేణి .. అందుకే బోనస్ ల బొనాంజా
ఒకప్పుడు నష్టాల బాటలో పయనించిన సింగరేణి, మూసివేత పరిస్థితికి చేరువైన సింగరేణి ఇప్పుడు లాభాలలో దూసుకుపోతోంది. కోల్ ఇండియా కంటే అత్యధిక లాభాలను సింగరేణి తన ఖాతాలో వేసుకుంటుంది. 2018 - 19 సంవత్సరంలో సింగరేణి సంస్థ 1765 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇక సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించిన కార్మికుల విషయంలో కూడా సింగరేణి యాజమాన్యం చాలా పాజిటివ్ గా వ్యవహరిస్తోంది. లాభాల బాటలో సింగరేణి పరుగులు పెడుతున్న నేపధ్యంలోనే బోనస్ల బొనాంజా కొనసాగుతుంది.
బోనస్ ఏకంగా 209 శాతం పెంచిన సింగరేణి సంస్థ
అందుకే సింగరేణి చరిత్రలోని గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగరేణి కార్మికులు బోనస్ ఏకంగా 209 శాతం పెంచింది అంటే నిజంగా ఇది కార్మికులకు ఒక బంపర్ బొనాంజానే . బోనస్ డబ్బుల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు సూచించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సంస్థ ఎప్పుడు కృషి చేస్తుందని, అదే విధంగా కార్మికులు సైతం సింగరేణి అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు.
దీపావళి బోనస్ కార్మికుల ఖాతాలో జమచేసిన సింగరేణి సంస్థ
ఇక దీపావళి సింగరేణి కార్మికులకు తీపి కబురు అందించింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. గతేడాది సింగరేణి యాజమాన్యం కార్మికులకు 60,500 రూపాయల చొప్పున బోనస్ గా చెల్లించింది. ఇక ఈ సారి మరింత ఎక్కువగా బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈసారి ఒక్కో కార్మికుడికి 64,700 రూపాయలను బోనస్ గా చెల్లించింది.
లక్షకు పైగా బోనస్ తో సంతోషంలో కార్మికులు
బోనస్ ను 25వ తేదీన కార్మికుల ఖాతాలలో జమచేసింది. సింగరేణి లో పనిచేస్తున్న దాదాపు 48 వేల మందికి పైగా కార్మికులు యాజమాన్యం అందిస్తున్న ప్రతిభ ఆధారిత ప్రయోజనంగా పి ఎల్ ఆర్ బోనస్ ను అందుకున్నారు. దీంతో సింగరేణి కార్మికులు దసరా, దీపావళి పండుగలకు కలిపి యాజమాన్యం బోనస్ ఇవ్వటంపై లక్షకు పైగా బోనస్ ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు.