తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అతనొక్కడే..! ఎదురులేని ఉత్తమ్ వ్యూహం..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవతరించబోతున్నారు. తాను చెప్పిందే వేదం అనేంతగా అధిష్టానం దృష్టిలో నాటుకుపోతున్నారు. మొత్తం టెన్ జన్ పథ్ ను వశపురుచుకుని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలకు కొరకరాని కొయ్యగా పరిణమించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సీనియర్ నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వాలో., ఎలాంటి పదవులు ఇవ్వకూడదో అదిష్టానాని దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిపోయారనే చర్చ జరుగుతోంది. అందుకు ఏఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ మొన్న ప్రకటించిన సీడబ్ల్యూసీ జాబితానే ఉదాహరణ అని చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో తనకు ఎవ్వరు పోటీ కాకూడదనే దిశగా ఉత్తమ్ వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
టెన్ జన్ పథ్ లో చక్రం తిప్పుతున్న ఉత్తమ్..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మొన్న సిడబ్ల్యూసి తోపాటు ఆహ్వానితుల కమిటీలను ప్రకటించారు. 23 మందితో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయాత్మక ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ' కొలువుదీరింది. ఇందులో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. అంతేకాదు కనీసం మిగిలిన కమిటీల్లో కూడా తెలంగాణ వారికి చోటు దక్క లేదు. సంస్థాగతంగా బలోపేతం దిశగా అడుగులు పూర్వవైభవ తీసుకొస్తామనుకుంటున్న తరుణంలో సీడబ్లూసీ జాబితా కాంగ్రెస్ క్యాడర్ ను నిరుత్సాహ పరిచింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నేతలకు ఒక్కరంటే ఒక్కరికైనా కీలక కమిటీల్లో స్థానం దక్కితే అటు జాతీయ పార్టీకి కానీ, ఇటు తెలంగాణ నాయకత్వానికి కానీ గౌరవంగా ఉండేదని పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. కానీ ఎందుకు అధిష్టానం ఇలా చేసిందన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ అదిష్టానానికి పీసిసి ఛీఫ్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారన్న సందేహాలు కూడా నాయకుల్లో మొదలయ్యాయి.
తనకు తానే పోటీ..తనకు తానే సాటీ.. తెలంగాణాలో ఇదీ ఉత్తమ్ వరస..
అత్యంత సీనియర్లుగా ఉన్న జైపాల్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పి వీరిలో ఎవరికీ చోటు దక్కకుండా చేశారని ప్రచారం సాగుతోంది. వీరు జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసుకోకుండా ఉత్తమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చర్చ జరుగుతోంది. వీరి నలుగురితో ఉత్తమ్ తమకే సిడబ్ల్యూసిలో చాన్స్ వస్తుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఉత్తమ్ తనకే సపోర్ట్ చేస్తారని జానా, తనకే అని జైపాల్, తనకే అని పొన్నాల, తనకే సపోర్టు అని గీతమ్మ ఎవరి ఆశల్లో వారు ఉన్నారు. అందరినీ అలా ఉత్తమ్ నమ్మించారని అంటున్నారు. దీంతో అందరూ అధిష్టానం వద్ద పెద్దగా ప్రయత్నాలు చేయలేదట.
హైదరాబద్ లో ఓకే...ఢిల్లీ వెళ్లాక నో..
ఇక్కడ వీరితో ఈ మాట చెప్పిన ఉత్తమ్ అధిష్టానం పెద్దలకు మాత్రం తెలంగాణ నుంచి ఎవరికీ సిడబ్ల్యూసిలో చోటు కల్పించాల్సిన అవసరం లేదని చెప్పేశారట. సిడబ్ల్యూసి లో లేకపోయినా కనీసం ఆహ్వానితుల జాబితాలోనైనా చోటు కల్పించాలన్న ఉద్దేశంతో అధిష్టానం ఉన్నా.. ఉత్తమ్ ససేమిరా అని వారించినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం వారు తెలంగాణ నేతలను పరిగణలోకి తీసుకోకుండానే కమిటీ రూపకల్పన చేశారని సమాచారం.
ఉత్తమ్ కు ఎవ్వరూ అడ్డు రాకూడదు.. అడ్డొస్తే అడ్రెస్ గల్లంతే..
2019లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్లైన జానా, జైపాల్, పొన్నాల, గీతారెడ్డి లాంటి వారికి సిడబ్ల్యూసిలో చోటు దక్కితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిఎం రేసులోకి వారే దూకుతారన్న ఉద్దేశంలో ఉత్తమ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే వారెవరికీ పై కమిటీలో చోటు లేకపోతే తానే సిఎం రేసులో ఉంటాను కదా అనే భావనతోనే ఇలాంటి స్కెచ్ వేశారని అంటున్నారు. ఉత్తమ్ ఈ స్కెచ్ ద్వారా అధిష్టానం వద్ద పలుకుబడి బాగా పెరిగిందని అంటున్నారు. కాగా ఉత్తమ్ మీద ఆ నలుగురు సీనియర్లు ఎలా రియాక్టు అవుతారనే అంశం ఉత్కంఠగా మారింది.