కర్రలు లేచాయి.. అటవీ అధికారుల వీపులు పగిలాయి.. కొత్తగూడెంలో మరో దాడి
కొత్తగూడెం : అటవీశాఖ సిబ్బందిపై దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కాగజ్ నగర్ ఏరియాలో టీఆర్ఎస్ నేతల జులుం మరచిపోకముందే.. కొత్తగూడెంలో మరో దాడి ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులను గిరిజనులు విచక్షణారహితంగా కొట్టడంతో వివాదస్పదమైంది. పోడుభూములను కొందరు దున్నుకుంటున్నారనే సమాచారం మేరకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఫారెస్ట్ ఉద్యోగులను చితకబాదడం చర్చానీయాంశమైంది.
ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..
పోడు భూముల రచ్చ.. అటవీ అధికారులపై మరో దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడుభూములు సాగుచేసుకుంటున్న కొందరు దాడికి పాల్పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలోని సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై.. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు చేసిన దాడిని మరవకముందే మళ్లీ అదే తరహా దాడి కొత్తగూడెం జిల్లాలో జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో పోడుభూములను సాగు చేసుకునే క్రమంలో కొందరు.. అటవీశాఖకు చెందిన భూమిని ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రాత్రి సమయంలో ఇలా గుట్టుచప్పుడు కాకుండా దున్నడమేంటని ప్రశ్నించారు. ఆ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావు ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించే సమయంలో ఒక్కసారిగా అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు స్థానికులు.
అడ్డుకున్న అధికారులు.. చితకబాదిన గ్రామస్తులు
పోడు భూములను దున్నుకుంటే మీకేమి సంబంధమంటూ అధికారులపై తిరగబడ్డారు స్థానికులు. ఆ క్రమంలో వాగ్వాదం జరగడంతో గొడవ ముదిరింది. సహనం నశించిన గ్రామస్తులు అధికారులపై దాడికి తెగబడ్డారు. కర్రలతో చితకబాదారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడినుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డ సదరు అధికారులు దాడి జరిగిన విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
గిరిజనులు అటవీ భూములను దున్నుతున్నారనే కారణంతో అక్కడున్న ట్రాక్టర్లను సీజ్ చేసి బేస్ క్యాంపుకు తరలించే క్రమంలో స్థానికులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ అటవీ అధికారులు ములకలపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కేసు..!
సోమవారం నాడు అటవీ భూముల వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుక్కయ్యారు. లోతువాగు 2వ బీట్ కంపార్టుమెంట్ పరిధిలోని చాతకొండ లక్ష్మిదేవిపల్లి మండలం, ఇల్లందు క్రాస్ రోడ్స్ టూరిజం హోటల్ దగ్గర అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీ లైన్ ఉంది. దాంతో అక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టారు అటవీశాఖ అధికారులు. అయితే 29వ తేదీ శనివారం నాడు ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అవుతున్న మాజీ ఎంపీటీసీ పూనం శ్రీను.. దాదాపు 80 మంది గ్రామస్తులను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ జరుగుతున్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాల్ పనులు నిలిపివేయించాడు.
ఆ క్రమంలో కొత్తగూడెం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ రావును ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించారు. ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పనులు ఆపివేయాలంటూ హెచ్చరించారు. అంతేకాదు ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండంటూ గ్రామస్తులకు నూరిపోయడం వివాదస్పదమైంది. దాంతో డిఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వనమా వెంకటేశ్వర రావుపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. అటవీ భూములకు సంబంధించి ఉద్యోగులపై దాడి చేస్తున్న ఘటనలు, బెదిరింపులు రోజుకో చోట వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.