ఓడిన నేతలకు మళ్లీ అవకాశం..! ఆ పార్టీలో వినూత్న ప్రయోగం..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య ఓటమి పాలైంది. అదికారంలోకి వచ్చామని వంద శాతం అంచనా వేసుకున్న ఆ పార్టీ నేతల ప్రణాళికలు తారుమారయ్యాయి. దాంతో హేమాహేమీలనుకున్న నాయకులు మట్టికరిసారు. ఖచ్చితంగా గెలిచి తీరుతారని నమ్మకాలు పెట్టుకున్న నేతలకు కూడా ఘోరపరాభవం తప్పలేదు. దీంతో నైరాష్యంలోకి వెళ్లే ప్రమాదం నుండి ఆ పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. ఓడిపోయినా సరే అదే అభ్యర్థులకు మరో సారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అదిష్టానం భావిస్తోంది. తర్వలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది అదిష్టానం. ఇంతకీ ఏంటా పార్టీ..? ఎవరా అభ్యర్థులు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ముందస్తు ఎన్నికల్లో హోరాహోరీ పోరాటం..! ఘోరంగా ఓడిపోయిన ప్రతిపక్షం..!!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది ప్రజాకూటమి. అయితే, రాష్ట్రంలోని ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. కూటమి ఏర్పడక ముందు వరకు టీఆర్ఎస్దే విజయమన్న టాక్ వినపడింది. కానీ, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన ప్రజాకూటమి మాత్రం బాగా బలపడింది. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి-ప్రజాకూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించారంతా. ముందస్తు ఎన్నికలు ఎంతో హోరాహోరీగా సాగినా.. ఫలితాలు మాత్రం వన్సైడే వచ్చాయి.
అతిరధ మహారధుల ఓటమి..! అనుకోని దెబ్బతిన్న ప్రత్యర్థి పార్టీ..!
రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమికి మాత్రం 21 స్థానాలే దక్కాయి. దీంతో కూటమిలోని అన్ని పార్టీలు సైలెంట్ అయిపోయాయి. అయితే, కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అడపాడపా మీడియా ముందుకు వచ్చి టీఆర్ఎస్ మోసం చేసి గెలిచిందని అంటూ పలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, ఓటమి నుంచి త్వరగా మేలుకుని, టీఆర్ఎస్కు గట్టి దెబ్బకొట్టాలని ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల కోసం ఓ ప్లాన్ రెడీ చేసేసింది.
ఓటమి నుండి తేరుకోవాలి..! భవిష్యత్తుకు బాటలు వేయాలంటున్న అదిష్టానం..!
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ చెప్పుకున్న చాలా మంది నేతలు ఘోర పరాభవాన్ని చవి చూశారు. జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖలకు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు. ఇప్పుడు వీరిలోని కొందరు ముఖ్యులను పార్లమెంట్ బరిలో దించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించుకుందని సమాచారం. వారిలో మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిల పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
నేతలకు ఊరట..! మరో అవకాశం ఉందంటున్న కాంగ్రెస్ అదిష్టానం..!!
ఇందులో నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తాను నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి రేవంత్రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈయనతో పాటు డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ రమేశ్రాథోడ్, భువనగిరి నుంచి పొన్నాల, కరీంనగర్ పార్లమెంట్కు మాజీ మంత్రి జీవన్రెడ్డి, నాగర్కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.