నేరెళ్ల ఇసుక కథ: కెసిఆర్ ఎదురు ప్రశ్నే తప్ప....
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా సహనంతోనే ఇచ్చారు. ఈ సమయంలో ఓ ప్రశ్నకు మాత్రం ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది.
నేరెళ్ల ఘటన ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం కాస్తా గొంతు పెంచారు. అరెస్టులపై ప్రస్తావించినప్పుడు లారీలను తగులబెడితే ఊరుకుంటారా అని కాస్తా కోపంగా ప్రశ్నించారు. నిజానికి కెసిఆర్ ఎదురు ప్రశ్న కాస్తా వాజీబుగానే ఉంది. లారీలను తగులబెట్టే స్థాయికి ఆందోళనకారులు చేరుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుంటే పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చోవాలని ఎవరూ చెప్పరు.
మీరా కుమార్ కంటతడి, కెటిఆర్ టార్గెట్: అసలు నేరెళ్లలో ఏం జరిగింది?
నేరెళ్ల అరెస్టుల గురించి కెసిఆర్ స్పందన అలా వచ్చిన తర్వాత ఇసుక లారీల కింద పడి ప్రజలు మరణిస్తున్న ఘటనను మీడియా ప్రతినిధుల్లో ఒక్కరైనా ప్రస్తావిస్తావిస్తారేమోనని అనుకోవడం అత్యాశే. కానీ ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ప్రస్తావిస్తే కెసిఆర్ ఎలా స్పందించేవారో.
కెసిఆర్ మాట్లాడిన రోజే....
కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన మంగళవారంనాడే మరో వ్యక్తి ఇసుక లారీల దాష్టీకానికి గురయ్యాడు. దాంతో మరో దళిత కుటుంబం రోడ్డున పడింది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాదా మండలం పోతుగల్ గ్రామంలో గిన్నె శంకర్ పొలం వద్దకు వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొని గాయపడ్డాడు. హైదరాబాదులోని నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో ఇసుక లారీల కింద పడి మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది.
Recommended Video
ప్రత్యక్ష, ప్రసారం వల్ల...
లారీలకు నిప్పు పెడితే ఊరుకుంటారా అనే కెసిఆర్ ఎదురు ప్రశ్న టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల తెలిసి వచ్చింది గానీ లేకుంటే అది పూర్తిగా మరుగున పడిపోయేదే. ఆ ఎదురు ప్రశ్నలోని తీవ్రతను గమనించే కాబోలు మీడియాలో దాని ప్రస్తావన దాదాపుగా లేకుండా పోయింది. "నేరెళ్ల ఘటన అనుకోకుండా జరిగింది. దీనికి దళితుల రంగు పులమడం సరికాదు. దళితులను కొట్టాలని ప్రభుత్వం చెబుతుందా? గుండాగిరీ చేస్తామంటే పోలీసులు చర్యలు తీసుకున్నారు" అని ఓ పత్రిక రాసింది. గుండాగిరీకి ఇచ్చిన ప్రాధాన్యం కెసిఆర్ వేసిన ఎదురు ప్రశ్నలకు లేకుండా పోయింది. ఇసుక లారీల ప్రమాదాల కారణంగా మృత్యువాత పడుతున్న వైనం కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావనకు రాలేదు.
తెరాస పత్రికలో ఇలా....
మామూలుగా కెసిఆర్ ప్రసంగాలను, మీడియా సమావేశాలను ఆయన మాటల్లోనే పదం జారవిడవకుండా నమస్తే తెలంగాణ ప్రచురిస్తుంది. కానీ కెసిఆర్ ఎదురు ప్రశ్నను మాత్రం ఆ పత్రిక కూడా జారవిడిచింది. "సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనను కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. గుండాగిరీ చేస్తుంటే పోలీసులు కేసుపెట్టారు. కావాలని దళితులను పోలీసులు టార్గెట్ చేయలేదు. దళితులను కొట్టాలని ప్రభుత్వం చెప్తుందా? కేసీఆర్ చెప్తాడా? అలా జరుగాల్సింది కాదు. కానీ కాంగ్రెస్ భూతద్దంలో చూస్తున్నది. పెద్దప్రచారం కల్పించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ కేసులలో దళితులతోపాటు ఇతరులు ఉన్నారు. కేసులు పెట్టడం సహజం. ఇసుక ద్వారా తెలంగాణ రాకముందు పదేండ్లలో రూ.50 కోట్లు ఆదాయం రాలేదు. మా ప్రభుత్వం వెయ్యికోట్ల వరకు ఆదాయం తీసుకొచ్చింది. దందాలు జరిగితే ఇంత ఆదాయం వస్తుందా? ఇసుక దందా తీసుకొచ్చినం అనే వాళ్లవి నోళ్లా లేక తాటిమట్టలా? పిచ్చి ఆరోపణలు చేయటం మానాలి" అని తెరాస అధికార పత్రిక నమస్తే తెలంగాణ రాసింది. ఆదాయం పెరిగిన విషయాన్ని మెచ్చుకోవాల్సిందే గానీ లారీల కింద పడి సంభవిస్తున్న అకాల మృత్యువాతల గురించి ఎవరు సమాధానం చెప్పాలనేది ప్రశ్న.
ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి...
ఇసుక లారీల కింద పడి ప్రజలు ఎందుకు మరణిస్తున్నారనేది ఆసక్తికరమైన విషయమే. ఇసుక రవాణాకు వేయి లారీలకు అధికారిక అనుమతి ఉన్నట్లు సమాచారం. అయితే, 1500 లారీల దాకా అక్కడ పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇసుక మాఫియాపై కొందరు కన్నేసిన నేపథ్యంలో అనధికారికంగా నడుస్తున్న లారీల గుట్టు బయటపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో నెంబర్లు గుర్తుంచుకోవడానికి వీలు కాకుండా డ్రైవర్లు లారీలను వేగంగా నడుపుతున్నారని, లారీలు వేగంగా నడవడానికి వీలుగా ఆ ప్రాంతంలో వేసిన స్పీడ్ బ్రేకర్లను కూడా తొలగించారని స్థానికులు చెబుతున్నారు. అందరి కళ్లు గప్పి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో లారీలను వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన అంటున్నారు. దీన్ని అరికట్టడానికి కెసిఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనేది ప్రశ్నార్థకమే.
నిజంగానే కాంగ్రెసును అనాలి....
కాంగ్రెసు విషయంలో కెసిఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నిజమేనని అనిపిస్తుంది. నేరెళ్ల సమస్యపై నిలకడగా, సుదీర్ఘంగా పోరాటాన్ని నడిపించడంలో, అక్కడి బాధితులకు భరోసా ఇవ్వడంలో కాంగ్రెసు కూడా విఫలమయ్యందనే చెప్పాలి. స్థానిక ప్రజలతో, అక్కడి తమ పార్టీ స్థానిక నేతలతో కలిసి పోరాటాన్ని సాగించడంలో కాంగ్రెసు విఫలమైంది. మాజీ స్పీకర్ మీరా కుమార్ను రప్పించి బాధితులను పరామర్శింపజేయడంతోనూ, క్రమం తప్పకుండా ప్రకటనలు ఇవ్వడంతోనూ సరిపోతుందని బహుశా కాంగ్రెసు నాయకులు అనుకుని ఉంటారు. కానీ, పోరాట పటిమను ప్రదర్శించడానికి అవసరమైన నాయకత్వం లోపించిందనే చెప్పాలి. కాంగ్రెసులో శిఖర ప్రాయమైన నాయకుడు ఏడి అని కెసిఆర్ అడిగారు. అటువంటి నాయకుడిగా ఎవరైనా కాంగ్రెసులో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. నేరెళ్ల ఘటనవంటివి ముందుకు వచ్చినప్పుడు తన సొంత సమస్యలాగా తీసుకుని పోరాటానికి నాయకత్వం వహించిన నాయకుడెవరైనా సరే, ప్రతిపక్షం నుంచి ఎదుగుతాడు. ఈ విషయాన్ని కాంగ్రెసు గుర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ చెప్పిన ఫలితాలే వస్తాయి.
కెటిఆర్ బకాసురుడి కన్నా దారుణంగా..
ఇసుక మాఫియాకు మరో దళితుడు బలయ్యాడని, నేరెళ్ల సంఘటన జరిగిన తర్వాత కూడా పట్టించుకోని ప్రభుత్వం ప్రజలను ఇసుక మాఫియాకు బలి పెడుతోందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో శంకరయ్య అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొట్టడంతో చనిపోయాడని ఆయన తెలిపారు.
ఇసుక మాఫియాలో కెటిఆర్ బంధువులకు వాటాలు
సిరిసిల్లలో జరుగుతున్న ప్రమాదాలకు కేటీఆర్ను బాధ్యుడిని చేసి కేసులు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాల కమీషన్లకు కక్కుర్తి పడి సొంత నియోజకవర్గ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటీఆర్... బకాసురుని కంటే అధ్వానమైన రాక్షసునిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.ఇసుక మాఫియాలో కేటీఆర్ సమీప బంధువులకి వాటాలున్నాయని ఆధారాలు సహా నిరూపించామని ఉత్తమ్ చెప్పారు.