బిగ్ టికెట్ పట్టం మళ్లీ భారతీయుడికే.. 28 కోట్ల లాటరీ జాక్పాట్
హైదరాబాద్ : కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడనే చందంగా కేరళలోని ఓ వ్యక్తికి జాక్పాట్ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 కోట్ల రూపాయల లాటరీ కలిసొచ్చింది. ప్రతి నెలా మూడో తేదీన అబుదాబి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో తీసే లక్కీ లాటరీలో భాగంగా నవంబర్ నెలకు గాను ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నారు కేరళకు చెందిన శ్రీను శ్రీధరన్. అక్టోబర్ నెలలో కర్ణాటకకు చెందిన అకౌంటెంట్, ఆగస్టులో నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు బిగ్ టికెట్ లాటరీలు గెలవడం విశేషం.
భారతీయుడికే మళ్లీ జాక్పాట్.. 28 కోట్ల లాటరీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే బిగ్ టికెట్ లాటరీ పారదర్శకంగా నిర్వహిస్తారు. ఆ క్రమంలో చాలామంది ఆ టికెట్లు కొనుగోలు చేసి తమ అదృష్టం పరీక్షించుకుంటారు. అయితే ఈ లాటరీలో అధికంగా జాక్పాట్ కొడుతోంది మాత్రం భారతీయులే. ప్రతి నెలా మూడవ తేదీన డ్రా తీస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ నెలకు సంబంధించి ఆదివారం, మూడవ తేదీన తీసిన డ్రాలో కేరళకు చెందిన శ్రీను శ్రీధరన్ నాయర్ 28 కోట్ల రూపాయల జాక్పాట్ కొట్టేశారు.
ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. శ్రీధరన్ అందుబాటులోకి రాలేదంట
అయితే లాటరీలో గెలుపొందిన వారికి నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం అందించడం ఆనవాయితీ. బిగ్ టికెట్ అఫీషియల్ వెబ్సైట్లో విజేతల పేర్లు పెడుతున్నప్పటికీ స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. అదే క్రమంలో శ్రీను శ్రీధరన్ నాయర్కు కూడా ఫోన్ చేశారు. అయితే ఆయన టికెట్ కొనుగోలు సందర్భంగా ఇచ్చిన రెండు ఫోన్లు పనిచేయలేదు. ఓ నెంబర్కు ఫోన్ చేస్తే అసలు శ్రీను శ్రీధరన్ ఎవరో తమకు తెలియదన్నారు. మరో నెంబర్కు ట్రై చేస్తే ఆయన లేరనే సమాధానం వచ్చిందట.
అక్టోబర్ 3వ తేదీన తీసిన డ్రాలో కర్ణాటక ఫయాజ్కు జాక్పాట్
కర్ణాటకకు చెందిన 24 సంవత్సరాల మహ్మద్ ఫయాజ్ ముంబైలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. స్నేహితుడితో కలిసి అక్కడే నివాసముంటున్న ఫయాజ్కు అబుదాబి బిగ్ టికెట్ లాటరీకి సంబంధించి అవగాహన ఉంది. ఆ క్రమంలో గత ఆరు నెలలుగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఈ లాటరీ తనకు ఎప్పుడైనా తగలక పోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ జాక్పాట్ తగలడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్టోబర్ మూడవ తేదీన తీసిన డ్రాలో ఆయన్ని అదృష్టం వరించి 28 కోట్ల రూపాయలు సొంతమయ్యాయి.
ఆగస్టు 3వ తేదీన తీసిన డ్రాలో నిజామాబాద్ వ్యక్తికి జాక్పాట్
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లికి చెందిన రిక్కాల విలాస్, పద్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు హిమాని ఇంటర్మీడియట్ చదువుతుండగా.. రెండో కూతురు మనస్విని 8వ తరగతి చదువుకుంటోంది. అయితే వీరి కుటుంబం జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఆ క్రమంలో ఆదాయం సరిపోవడం లేదని విలాస్ దుబాయ్కు వెళ్లాడు. కానీ అక్కడ ఉద్యోగం దొరక్క.. తిరిగి స్వస్థలానికి తిరిగొచ్చాడు. అయితే బిగ్ టికెట్ కొనే అలవాటున్న విలాస్కు ఆగస్టు 3వ తేదీన అదృష్టం కలిసొచ్చింది. అతను కూడా 28 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.