మరో మిలియన్ మార్చ్కు సన్నాహాలు..! గొంతెత్తిన పార్టీలు..! ఆర్టీసికి అండగా నేతలు..!
హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. కార్మిక లోకానికి అండగా ఉంటామని, అలాగే ప్రభుత్వం మొండి వైఖరి విడనాడలని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. కార్మికుల అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిరాక పోతే మరో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్ని పార్టీలు శపధం చేసాయి. సరూర్ నగర్ సకల జన భేరి కార్యక్రమంలో నేతలు మాట్లాడిన తీరు చూస్తుంటే తెలంగాణలో మరో కురుక్షేత్రం తప్పదనే వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ రణరంగంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
మరో మిలియన్ మార్చ్ దిశగా సన్నాహాలు..!
ఆర్టీసీ కార్మికుల భవిత కోసం హైదరాబాద్ లో మరోసారి మిలియన్ మార్చ్ చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన సకల జన భేరిలో కోదండరామ్ పాల్గొని ఉద్వేగభరింతంగా ప్రసంగించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు. జీతాలు పెంచాలని కార్మికులు కోరడం లేదని, ఆర్టీసీకి పునరుజ్జీవం కల్పించాలని కోరుతున్నారని అన్నారు. కార్మికులను చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని, యుద్ధ ఖైదీలను తీసుకెళ్లినట్లు తీసుకెళ్లి చర్చలు జరిపారని మండిపడ్డారు.
సమ్మెకు తెలంగాణ ప్రజలు మద్దత్తు ఉంది..!
తెలంగాణ ప్రజానికం నుంచి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఉందని మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అంశాలను అమలు చేస్తున్నప్పుడు, ఆర్టీసీ డిమాండ్లు కూడా అమలు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకుండానే చంద్రశేఖర్ రావు తన కుటుంబ సభ్యులకు పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం చంద్రశేఖర్ రావు పాలనలో ప్రతి అంశానికి కోర్టు ప్రమేయం ఉంటుందని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర సీఎంలు అనుమతులు ఇచ్చారని, కానీ తెలంగాణ వచ్చాక చంద్రశేఖర్ రావు ఇవ్వడం లేదన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు కార్మికులను రెచ్చగొట్టవద్దని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది ఉడత సహయమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల దీక్షలు కొనసాగుతాయన్నారు.
ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడూ ఉంటాయి..!
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాయని, చంద్రశేఖర్ రావు ఆర్టీసీ చరిత్రను తెలుసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31శాతం ఉందని ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని, ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలన్నారు. ప్రభుత్వం కోర్టుకు సరైన లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటుందని, ఉద్యమాలు, పోరాటాల ద్వారా హక్కులు సాధించుకుందామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..
చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని దింపాల్సిన రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బంది పడేందుకా తెలంగాణ సాదించుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీని చూస్తానని చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని, హుజుర్ నగర్ ఎన్నికల కోసం 50కోట్లు ఖర్చు చేసి, 100 కోట్ల హామీ ఇచ్చారని, కానీ ఆర్టీసీకి ఇవ్వడానికి 47కోట్ల రూపాయలు లేవా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఆర్టీసీని విభజన చేయకపోతే వరంగల్ భూములను ఎలా లీజుకు ఇచ్చారని, పెట్రోల్ బంక్ లు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.
తెలంగాణలో స్వేచ్చ లేదు..
కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధకాండ నడుస్తుందని టిటిడిపి ప్రెసిడెంట్ ఎల్. రమణ అన్నారు. ఒక డ్రైవర్ కొడుగ్గా ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని తెలియజేసారు. ఆర్టీసీ ఐకమత్యాన్ని విచ్చిన్నం చేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తారని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని రమణ పిలుపునిచ్చారు. కార్మికులను డిస్మిస్ చేసే హక్కు చంద్రశేఖర్ రావుకు లేదన్నారు. చంద్రశేఖర్ రావు రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ భూముల పై కన్నేశారని, 60వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకోవడానికి చంద్రశేఖర్ రావు ప్రణాళిక రచిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. ప్రొ.జయశంకర్ బ్రతికి ఉంటే కోదండరాం పరిస్థితే ఉండేదని, హైకోర్టు అడిషనల్ ఏజీ రామచంద్రరావు కేసీఆర్ బంధువని, ఆయనకు భారత చట్టం గురించి పెద్దగా అవగాహన లేదని వీహెచ్ అన్నారు.
ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ను ఎదిరించారు..!
ఆరేళ్ల చంద్రశేఖర్ రావు పాలనలో ఇబ్బందులు తప్ప సంతోషం లేదని ఎమ్మర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. చంద్రశేఖర్ రావుని చూసి మాట్లాడేందుకు బయపడుతున్న ప్రస్తుత తరుణంలో, మొట్టమొదటిసారిగా ఆర్టీసీ కార్మికులు ఎదురించి ముందుకు వచ్చారని అభినందించారు. ఆర్టీసీని ఖతం చేస్తానంటే చంద్రశేఖర్ రావు ఖతం అవ్వడం కూడా ఖాయమన్నారు. ఓటమి చివరిలో హిట్లర్ కి పట్టిన గతే చంద్రశేఖర్ రావు కి పట్టేలా కార్మికులు పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.