ఛలో ఇడుపులపాయ.. తెలంగాణలో జగన్ మరో వీరాభిమాని పాదయాత్ర
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రాంతాలకతీతంగా అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వైఎస్ కుటుంబాన్ని ఆరాధించేవారు చాలామంది తెలంగాణలో ఉన్నారు. అయితే ఆ కుటుంబ సభ్యులపై సమయం వచ్చినప్పుడుల్లా అభిమానం కురిపిస్తూనే ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వైసీపీ నేత బెజ్జంకి అనిల్ కుమార్ వైఎస్ కుటుంబాన్ని అమితంగా ఆరాధిస్తారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన పదేళ్లుగా పాదరక్షలు ధరించలేదు. తాజాగా తెలంగాణకు చెందిన మరో అభిమాని కూడా వైఎస్ కుటుంబం పట్ల ఆరాధన చాటుకుంటున్నారు.
తెలంగాణ ఇలాకాపై బీజేపీ, కాంగ్రెస్ కన్ను.. మరి టీఆర్ఎస్ పరిస్థితి.. ఇంతకు 2023 ఎవరిది?
వైఎస్ జగన్కు ఏపీ ముఖ్యమంత్రిగా ఛాన్స్ వస్తే.. ఇడుపులపాయకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన శివలింగం. ఆ మేరకు మే 29వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని.. అప్పటినుంచి ఆయనకు వీరాభిమానిగా మారినట్లు చెబుతున్నారు.
వైఎస్ జగన్ సీఎం ఐతే ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేస్తానని తమ ఇంటి దైవమైన మేడాలమ్మ తల్లికి మొక్కుకున్నట్లు చెప్పారు శివలింగం. తాను ఆ తల్లికి మొక్కిన ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయ్యారని.. దాంతో తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
అదలావుంటే చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుండటం మరో విశేషం. దాదాపు రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున నడక కొనసాగిస్తున్నట్లు చెప్పారు శివలింగం. ఈనెల 9వ తేదీ వరకు ఇడుపులపాయకు చేరుకోనున్నట్లు తెలిపారు. అయితే శివలింగంకు సాయంగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్ అభిమానులు బైక్పై ఫాలో అవుతూ అతడికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు.