రైల్వేలో ఉద్యోగాలంటూ.. నిరుద్యోగులకు లేడీ కిలాడీ గాలం.. ఆ తర్వాత..!(వీడియో)
కొత్తగూడెం : మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయక జనాలు బుట్టలో వేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. రోజుకో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక సంపాదన లేని నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలంటూ గాలం వేస్తూ లక్షల్లో దోచుకుంటున్న మాయగాళ్లకు కొదువే లేదు. ఏవో నాలుగు మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామంటే చాలు.. పోలోమంటూ ఫాలో అవుతూ అప్పుసప్పు జేసి మోసగాళ్ల చేతిలో డబ్బులు కుమ్మరిస్తున్న ఘటనలు కొకొల్లలు.
తాజాగా కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగుచూసింది. రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ జూపి లక్షలు దండుకున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 2017లో రైల్వే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన సదరు ముఠాసభ్యులు నిరుద్యోగులకు గాలం వేశారు. ఆ క్రమంలో ఐదుగురి నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు వసూలు చేశారు.
ప్రతిపక్షం ఉంటేనే సభకు హుందాతనం అంటున్న జగన్.. మరి కేసీఆర్ ఎందుకిలా?
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఇండ్ల కుమారి సూత్రధారిగా వ్యవహరించిన ఈ మోసంలో మరో నలుగురు యువకులు పాత్రధారులుగా మారారు. ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఉద్యోగం గ్యారంటీ అంటూ మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నారు. అలా 20 లక్షలు వసూలు చేసిన అనంతరం ఉద్యోగాల మాటెత్తితే అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన చేస్తూ వచ్చారు.
తీరా డబ్బులు ఇచ్చిన సదరు నిరుద్యోగుల నుంచి వత్తిడి పెరగడంతో.. మరోసారి అడ్డదారులు తొక్కారు. నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మరో మోసానికి తెగబడ్డారు. చివరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కారు. కొత్తపల్లి రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.