ఆల్ టైం హైక్కి ఉల్లి ధర: క్వింటా ఉల్లి రూ.14 వేలు, రూ.150 నుంచి రూ.170కి కిలో ఉల్లి...
ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు. ఈ సామెత నిజమే. అందుకే వంటింటి నిత్యవసరమైపోయింది. అందుకేనేమో ఉల్లి ధర పైపైకి ఎగబాకింది. క్వింటాల్ ఉల్లి ధర ఆల్ టైం రికార్డ్ ధర పలుకడం విశేషం. క్వింటాల్ ఉల్లి రూ. 14 వేలు పలికింది. దీంతో ఉల్లిని కొనడం కాదు.. చూడటమే మేలని వినియోగదారులు అంటున్నారు.
ధర వింటేనే..
సాధారణంగా ఉల్లి పాయ కోసేప్పుడు కన్నీరు తెప్పిస్తుంటోంది. కానీ ఇప్పుడు ఉల్లి పేరు వింటేనే సామాన్యుడు భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉల్లి ధరలు పెరగడం ఇందుకు కారణం. కిలో ఉల్లి కావాలంటే మినిమం రూ.150 నుంచి రూ.170 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ కారణం..
మహారాష్ట్రలో వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో కొరత ఏర్పడింది. ఉల్లి ధరకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అవి సత్పలితాలను ఇవ్వడం లేదు. గురువారం క్వింటా ఉల్లి పలికిన ధర భవిష్యతలో కూడా పలకదేమోనని చర్చ జరుగుతుంది. దేశంలో ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి రూ.150కి తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు.
ఆల్ టైం హై..
గురువారం క్వింటాల్ ఉల్లి ధర రూ.2 వేలు పెరగడం విశేషం. బుధవారం రూ. 11 వేల పైచిలుకు ఉన్న ధర 24 గంటల్లోనే 13 వేల నుంచి 14 వేల మధ్య పలికింది. కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.13 వేల 160 పలుకగా, మలక్పేట మార్కెట్లో అది 14 వేలకు చేరింది. హోల్సేల్గానే ఉల్లి రూ.150కి విక్రయించ పరిస్థితి ఏర్పడింది. ఇక రిటైల్ మార్కెట్లో దాని ధర రూ.170 వరకు చేరింది. విశాఖపట్టణంలో కిలో ఉల్లిపాయం రూ.130 పలుకుతుండగా, విజయవాడలో కిలో ఉల్లి రూ.120కి విక్రయిస్తున్నారు.
పార్లమెంట్లో కూడా..
ఉల్లి ధరలపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. పార్లమెంట్లో కూడా చర్చకు దారితీసింది. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోనని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేచారు. ఉల్లి తినరా.. వెల్లుల్లి, అల్లం కూడా తీసుకోరా అని ప్రశ్నించారు. చిదంబరం ఒక్క అడుగు ముందుకేసి మరి కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నేతల కామెంట్లపై కేంద్రమంత్రి అశ్వనీ చౌబే ధీటుగా స్పందించారు. ఉల్లి తెలియకుంటే, వంటగదిలో వాడకుంటే దాని ధర ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.